కొవిడ్-19 వైరస్ అత్యంత ప్రమాదకరమైనదని... ప్రభుత్వ సూచనలను పాటించి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని హుస్నాబాద్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి ప్రజల్ని కోరారు. ఇది అప్రమత్తంగా ఉండాల్సిన సమయం... ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయొద్దన్నారు. రాబోయే 15 రోజులు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలని ప్రజలుకు సూచించారు. తీవ్రమైన జ్వరం, దమ్ము, దగ్గుతో బాధపడుతూ శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్న వారు వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలన్నారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, షేక్ హ్యాండ్స్ (కరచాలనం) ఇవ్వొద్దని కోరారు. ఎప్పటికప్పుడు చేతులను శానిటైజర్తో శుభ్రం చేసుకోవాలని సిద్దిపేట జిల్లా ప్రజలకు సూచించారు.
హుస్నాబాద్ డివిజన్లో విదేశాల నుంచి వచ్చిన 65 మందిని గుర్తించారు. ఇప్పటి వరకు వారిలో ఎలాంటి ఫ్లూ లక్షణాలు లేవని... అయినప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకుని సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండాలని సూచించారు.
సంత రద్దు
కరోనా ప్రభావంతో ఎల్లమ్మ రోడ్డులో జరగాల్సిన వార సంతను(అంగడి) రద్దు చేస్తున్నట్లు ఆర్డీఓ తెలిపారు. వ్యాపారులు, పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు.
హుస్నాబాద్ రెవెన్యూ డివిజినల్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏసీపీ మహేందర్, మున్సిపల్ కమిషనర్ రాజ మల్లయ్య, తహసీల్దార్, మున్సిపల్ ఛైర్మన్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి: పరీక్షా కేంద్రం నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్యాయత్నం