కరోనా రోగుల విషయంలో ప్రభుత్వం మానవత్వం లేకుండా పాలన చేస్తోందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ సెక్రటేరియట్ కట్టడంలో బిజీ ఉంటే... సీఎస్ సోమేశ్ కుమార్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. క్షేత్ర స్థాయిలో తిరుగుతూ నిజాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా... పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
బతికుంటే సరైన చికిత్స లేదు.. చనిపోతే శవాన్ని కుటుంబాలకు ఇవ్వడానికి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కరోనా పాజిటివ్ వచ్చినవాళ్లకు ఊపిరితిత్తుల సమస్య, హార్ట్ ఎటాక్ వస్తుందన్న ఆయన... సీరియస్ గా ఉన్న రోగులను గాంధీ హాస్పిటల్ కి పంపుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు.
గాంధీ హాస్పిటల్ కి పది మంది వెళ్తే... 5 గురు మాత్రమే బతుకుతున్నారన్నారు. అబ్దుల్ కయిమ్ అనే వ్యక్తి ఆక్సిజన్ అందకపోవడం వల్లే మరణించాడని తెలిపారు. వైద్యశాఖ బులిటెన్ కే పరిమితమయిందని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో జరిగే విషయాలపై మంత్రి ఈటల, ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు.