హెచ్ఎండీఏ పరిధిలోని మూడు చెరువుల భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలకు గతంలో కొందరు అధికారులు అనుమతులు ఇచ్చారని స్పష్టమైంది. సంగారెడ్డి జిల్లా చెలికుంట, మేళ్లచెరువు, వనం చెరువుల్లో నిర్మాణాలు చేసుకునేలా అనుమతులు ఇచ్చారని తేల్చింది. చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు హెచ్ఎండీఏ కమిషనర్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్, చిన్న నీటిపారుదలశాఖ చీఫ్ ఇంజినీర్లతో ఏర్పాటైన కమిటీ ఈ నెల 11న సమర్పించిన నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. ఈ అక్రమ కట్టడాలను తొలగించి చెరువులను పరిరక్షించాలని కోరుతూ హ్యూమన్ రైట్స్, కన్స్యూమర్ ప్రొటెక్షన్ ట్రస్ట్ తరఫున ఠాకూర్ రాజ్కుమార్సింగ్ 2015, 2016 సంవత్సరాల్లో జాతీయ హరిత ట్రైబ్యునల్ని ఆశ్రయించారు. దీంతో 2020 ఫిబ్రవరిలో కమిటీ ఏర్పాటైంది.
ఉల్లంఘనలు నిజమే
- చెలికుంట చెరువు పరిధిలో ఇండస్ క్రెస్ట్, ఎన్సీసీ కంపెనీ, సాఫ్ట్వేర్ ఇంజినీర్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు
- మేళ్లచెరువు పరిధిలో ఏలియన్స్ స్పేస్ స్టేషన్, నివీ ప్రాపర్టీ డెవలపర్స్, సంకల్ప్ హోమ్స్
- వనం చెరువు పరిధిలో శ్రీబాలాజీ బార్ అండ్ రెస్టారెంట్తో పాటు ఒక రైస్మిల్లు నిర్మించారు.
2006 నుంచి 2017 వరకు నీటిపారుదల, రెవెన్యూ విభాగాల్లో పనిచేసిన అధికారులు నాలా అనుమతులతో పాటు నిరభ్యంతర ధ్రువపత్రాలు(ఎన్వోసీ) ఇచ్చినట్లు నివేదికలో పొందుపరిచారు. నీటిపారుదలశాఖ ఏఈలుగా పనిచేసిన ఎల్.రాజేశ్వర్రెడ్డి, కె.బుచ్చయ్య, పి.రాములు, చింతల బాలరాజు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో ఎన్వోసీలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. గతంలో సంగారెడ్డి ఆర్డీవోలుగా పనిచేసిన కె.మృత్యుంజయ, బి.రామమూర్తి, రామచంద్రారావు, డి.శ్రీనివాస్రెడ్డి నాలా అనుమతులు ఇచ్చినట్లు గుర్తించారు. ఏయే సంస్థ ఏ మేరకు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టిందనేది నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు.
ఇదీ చదవండిః యథేచ్ఛగా మూగజీవాల అక్రమ రవాణా...