ఈస్టిండియా కంపెనీ పాలనాకాలంలో దేశంలో ఏర్పాటు చేసిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. కలకత్తా కేంద్రంగా 1801లో ఏర్పాటైన అలాంటి ఫ్యాక్టరీలను ఆ తర్వాత దేశవ్యాప్తంగా పలుచోట్ల నెలకొల్పారు. స్వాతంత్య్రం అనంతరం దేశ అవసరాలకు అనుగుణంగా మిత్రదేశాల సాంకేతిక సహకారంతో పలు పరిశ్రమలు నెలకొల్పారు.
దేశవ్యాప్తంగా 41...
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఉండగా అందులో పిస్టళ్ల నుంచి యుద్ధ ట్యాంకర్ల వరకు వివిధ రకాల ఆయుధాలు ఉత్పత్తిచేస్తున్నారు. పశ్చిమబంగాలోని కాశీపూర్లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిన రోజును ఏటా వ్యవస్థాపక దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు.
సందర్శనకు...
ఉత్సవాల్లోభాగంగా మెదక్ పరిశ్రమలో తయారు చేస్తున్న యుద్ధట్యాంక్, అంబులెన్స్లను ప్రజల సందర్శనకు ఉంచారు. ఫ్యాక్టరీలో తయారయ్యే రక్షణ వాహనాల ప్రత్యేకతలు, భవిష్యత్తులో రానున్న ఆవిష్కరణలపై జనరల్ మేనేజర్ ఆలోక్ ప్రసాద్ వివరించారు. రక్షణ దళాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నామని అత్యవసర సమయంలో ఒకే రోజు 33యుద్ధ ట్యాంకర్లను సైనికాధికారులకు అందించామని తెలిపారు.
తెలంగాణ గర్వించదగ్గ సంస్థ మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ. దేశంలో ఇన్ఫ్యాంటరీ కంబాట్ వెహికిల్స్ తయారు చేసే ఏకైక సంస్థగా ఇది పేరుపొందింది. ప్రపంచంలోనే అత్యుత్తమ యుద్ధ ట్యాంకులను ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నాం. బీఎంపీ ట్యాంకర్లకు మందుపాత్రలను తట్టుకునే సామర్థ్యంఉండదు. ఆ సమస్యను అధిగమించేందుకు ఎఫ్ఐసీవీ ట్యాంకర్లను ఆవిష్కరించబోతున్నాం. సీబీఆర్డీ సహకారంతో మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ రూపొందించిన సీసీపీటీ వెహికిల్ సిద్ధమైంది. ఆ వాహనాన్ని ఏప్రిల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
--- ఆలోక్ ప్రసాద్, జీఏం
ప్రస్తుతం 125...
ప్రస్తుత సంవత్సరానికి 125 ట్యాంకర్లు ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపిన ఆలోక్ప్రసాద్ వచ్చే సంవత్సరానికి ఆ సామర్ధ్యాన్ని 200కు పెంచబోతున్నట్లు స్పష్టంచేశారు. ఆ దిశగా పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు. ఏప్రిల్ చివరి నాటికి కేనాన్ వజ్రా రక్షణ వాహనాన్ని విడుదల చేయబోతున్నట్లు అలోక్ ప్రసాద్ పేర్కొన్నారు.
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా......... సందర్శనకు ఉంచిన యుద్ధట్యాంకర్లను చూసేందుకు ప్రజలు ఆసక్తిచూపారు. యుద్ధవాహనాలపైకి ఎక్కి సరదాగా ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు.
ఈస్టిండియా కంపెనీ దేశంలో ఈఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేసింది. స్వాతంత్య్రానికి ముందు దేశవ్యాప్తంగా 18 ఉండగా... అనంతరం 22 ఫ్యాక్టరీలు నెలకొల్పారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మొదట ఏర్పాటు చేసి 220 ఏళ్లు పూర్తైంది. ప్రస్తుతం దేశంలో 41 ఫ్యాక్టరీలు కొనసాగుతున్నాయి. అందులో ఒకటే తెలంగాణలోని మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ. సైన్యాన్ని యుద్ధక్షేత్రానికి తరలించే వాహనాలను ఇక్కడ తయారుచేస్తున్నాం. సైనికులను రక్షించేందుకు ఆ వాహనాలను ఉపయోగిస్తుంటారు. ఆరు నుంచి ఏడుగురు వ్యక్తులు భారీ మంటల్లోనూ ప్రయాణం చేసేలా ఈ వాహనాలను తయారుచేస్తున్నాం. యుద్ధంలో ఈ వాహనాల నుంచే నేరుగా శత్రువుపై దాడిచేయవచ్చు.
--- కుమార్ పక్రా, జేజీఏం
ఇదీ చదవండి: తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులు విడుదల చేయాలి: నామ