సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామంలో నెలకొన్న భూసమస్యకు పరిష్కారం లభించటంలేదు. గ్రామంలోని సర్వేనెంబర్-72లో 859 ఎకరాల భూములను అధికారులు వక్ఫ్ గెజిట్లో చేర్చారు. 1954 నుంచి పట్టాలుగా ఉన్న భూములను వక్ఫ్ గెజిట్లో పేర్కొనడంతో... భూప్రక్షాళన అనంతరం వీటిని సాగుచేసుకుంటున్న రైతులకు కొత్తపాసుపుస్తకాలు అందలేదు. ఆందోళనకు గురైన సంబంధిత 140మంది రైతులు... అధికారులను ఆశ్రయించారు. రెండేళ్లుగా ఇదే విషయమై తహశీల్దారు నుంచి జిల్లా కలెక్టర్, మంత్రుల దాకా తిరిగినా ఎలాంటి పరిష్కారం లభించటంలేదని బాధితులు వాపోతున్నారు.
గ్రామం మీదుగా సాగే హైదరాబాద్-ముంబయి జాతీయ రహదారి పక్కనే ఉన్న పొలాలను విక్రయించుకుని.... ఊరికి దగ్గరగా ఉన్న పొలాలను గతంలో కొన్నారు. ఈ భూములను ఏళ్ల కిందటే... రిజిస్ట్రేషన్ చేయించుకుని వీటిపై బ్యాంకుల్లో రుణాలు కూడా తీసుకున్నారు. వక్ఫ్ గెజిట్తో పాసుపుస్తకాలు నిలిపివేయటం, భూములను పార్ట్-బిలో చేర్చటంతో ప్రభుత్వ పథకాలకు కూడా నోచుకోలేకపోతున్నామని బాధితులు వాపోతున్నారు. భూమి ఉందనే ధైర్యంతోనే.... బయట అప్పులు చేశామని ఇప్పుడు తీర్చేందుకు... బ్యాంకు రుణాలు కూడా తీసుకోలేని పరిస్థితి నెలకొందని ఆవేదన చెందుతున్నారు.
సొంత భూములను వక్ఫ్ భూములుగా గెజిట్లో చూపించి రైతుల బతుకులతో అధికారులు చెలగాటమాడుతున్నారని బాధితులు వాపోతున్నారు. కనీసం సాగుకు అవసరమయ్యే ఎరువులు, విత్తనాలకూ పాసుపుస్తకాలడుగుతున్నారని... ఈ పరిస్థితుల్లో భూమి ఉన్నా ఏమిచేయలని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. కోట్లాది రూపాయల విలువ చేసే ఈ భూముల ప్రతిష్టంభనపై ప్రభుత్వం దృష్టి సారించి... తమకు న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు.