రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హలో నిర్మించిన అతిపెద్ద ధ్యాన మందిరాన్ని యోగా గురువు బాబా రాందేవ్ ఇవాళ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మిషన్ గురూజీ కమలేష్ డి పటేల్ పాల్గొననున్నారు. పలుదేశాలకు చెందిన 40 వేల అభ్యాసీలు హాజరుకానున్నారు. హార్ట్ ఫుల్నెస్ సంస్థ ఆధ్వర్యంలో 30 ఎకరాల విస్తీర్ణంలో లక్ష మంది ఒకే చోట ధ్యానం చేసేందుకు వీలుగా ఈ కేంద్రాన్ని నిర్మించారు. హార్ట్ ఫుల్నెస్ సంస్థ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ మెడిటేషన్ కేంద్రం ఐకానిక్ డిజైన్గా నిలవనుంది.
హార్ట్ ఫుల్నెస్ సంస్థ గ్లోబల్ గైడ్ దాజి ఈ ప్రతిష్ఠాత్మక కేంద్రాన్ని ప్రజలకు అంకితం చేయనున్నారు. అడవికి దగ్గరలో పూర్తి ప్రశాంత వాతావరణం మధ్య ఈ కేంద్రాన్ని నెలకొల్పారు. తాబేలు ఆకారంలో 8 ఉపకేంద్రాలు నిర్మించారు. విద్యుత్ వెలుగుల మధ్య ఈ ధ్యాన కేంద్రం కాంతులీనుతోంది. ఆధ్యాత్మికత, ఆహ్లాదం, పచ్చిక మైదానాలతో కూడిన ఈ ధ్యాన కేంద్రంలో మెడిటేషన్ చేస్తే... ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని పొందవచ్చని నిర్వాహకులు తెలిపారు.
2017 డిసెంబర్ 25న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ ధ్యాన మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఫిబ్రవరి 2న కోవింద్ ఈ కేంద్రాన్ని సందర్శించనున్నారు.
- ఇవీ చూడండి: నేరేడుచర్లలో నేడైనా.. జరిగేనా ఎన్నిక...