రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో కేంద్రంలో స్టడీసర్కిల్ ఏర్పాటుకు అనుమతిస్తూ బీసీ సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 11 బీసీ స్టడీ సర్కిళ్లు ఉండగా... ఉమ్మడి జిలాల్లో ఉన్న కేంద్రాలు ఇతర ప్రాంతాలకు దూరంగా ఉన్నాయని వివరించింది.
ఉమ్మడి జిల్లాకేంద్రానికి దూరంగా ఉన్న సిరిసిల్లలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు అత్యంత అవసరమని బీసీ సంక్షేమశాఖ తెలిపింది. స్టడీ సర్కిల్ ఏర్పాటుతో పేద బీసీ యువతకు శిక్షణ లభిస్తుందని పేర్కొంది. కొత్త స్టడీ సర్కిల్ ఏర్పాటు కోసం ఒప్పంద పద్ధతిన సంచాలకులు, పొరుగుసేవల కింద ఏడుగురు సిబ్బందిని నియమించుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చినట్లు వెల్లడించింది. స్టడీ సర్కిల్ ఏర్పాటుకు రూ.77 లక్షలా 80 వేల వ్యయం కానుందని వివరించింది.