ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తామని, ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని... రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. 32వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా పట్టణంలో ఏర్పాటు చేసిన హెల్మెట్ అవగాహనా ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా ఈ మాసోత్సవాలను నిర్వహిస్తున్నామని అన్నారు.
మోటార్ వాహన చట్టాలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తామని ఎస్పీ చెప్పారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్, కారు నడిపేటప్పుడు సీటు బెల్టు ధరించాలని సూచించారు. అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రమాదాలు జరగకుండా సహకరించాలని అన్నారు.
ప్రతి వాహనానికి నెంబర్ ప్లేటు అమర్చుకోవాలని, నెంబర్ ప్లేట్ లేని వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్, స్పీడ్ లేజర్ గన్ టెస్టుల ద్వారా కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలో రహదారి భద్రత మాసోత్సవాలు నిర్వహించాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు.
ఇదీ చదవండి: ప్లాస్టిక్ రహిత మేడారం జాతర కోసం పాదయాత్ర