కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గల్ఫ్ కార్మికులు పట్టించుకోవడం లేదని ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షులు పరికిపండ్ల స్వదేశ్ అన్నారు. గల్ఫ్ కార్మికుల వేతనాల్లో 30 నుంచి 50 శాతం వరకు తగ్గించడానికి ఆమోదం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గల్ఫ్ జేఏసీతో కలిసి గల్ఫ్ భరోసా దీక్ష చేపట్టారు.
గల్ఫ్ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలం అయ్యాయని స్వదేశ్ అన్నారు. దేశ వ్యాప్తంగా సుమారు 90 లక్షల మంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లారని తెలిపారు. కేంద్రం జారీ చేసిన తాజా ఉత్తర్వులతో పూర్తిగా అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రూ. 500 కోట్లతో వారికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయుల హక్కులు, సంక్షేమ వేదిక సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కోటపాటి నర్సింహనాయుడు, ఇతర సభ్యులు రుద్ర శంకర్, గణేష్, అనిల్, హన్మండ్లు, కిరణ్ కుమార్ తదితరులున్నారు.
ఇదీ చదవండి: 'హైదరాబాద్లో వ్యాక్సిన్ తయారు కావడం గర్వంగా ఉంది'