నిర్మల్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటం వల్ల అధికార యంత్రాంగం శుక్రవారం నుంచి మంగళవారం వరకు అయిదు రోజుల పాటు ప్రత్యేక లాక్డౌన్ ప్రకటించింది. గురువారం ఒక్కరోజే ఐదు కేసులు నమోదు కావడంతో జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 20కి పెరిగింది. ఈ పరిస్థితితో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటివరకు జిల్లాలో సాధారణ లాక్డౌన్లో భాగంగా ఉదయం 7 నుంచి 10 గంటల వరకు కూరగాయలు, నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం మినహాయింపు ఇచ్చారు. ఈ ప్రత్యేక లాక్డౌన్లో అలాంటి సడలింపుపైనా నిషేధం విధించారు. అయిదు రోజుల పాటు అందరూ ఇళ్లకే పరిమితం కావాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ ప్రకటించారు. జిల్లాలో 11 కంటైన్మెంట్ జోన్లను గుర్తించామన్నారు.
జిల్లా కేంద్రమైన నిర్మల్లోని జహురానగర్, గాజుల్పేట్, గుల్జార్మార్కెట్, మొగల్పుర, భైంసా పట్టణంలోని పురానా బజార్, పాండ్రిగల్లీ, నర్సాపూర్(జి) మండలం చాక్పెల్లి, లక్ష్మణచాంద మండలం కనకాపూర్, రాచాపూర్, మామడ మండలం న్యూలింగంపల్లి, పెంబి మండలం రాయదారి గ్రామాలను హాట్స్పాట్లుగా గుర్తించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఆ ప్రాంతాల నుంచి ప్రజలెవరూ బయటకు రాకుండా.. ఇతరులు ఆ ప్రాంతాలకు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అధికారులే నిత్యావసర సరకులు అందజేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఇళ్ల నుంచి బయటకు వస్తే కర్ఫ్యూ ఉల్లంఘనతో పాటు, అంటురోగాల వ్యాధుల చట్టం కింద కేసు నమోదు చేస్తారు. కేవలం మందులు, అత్యవసర వైద్యసేవలు అవసరమయ్యే వారికి మాత్రమే మినహాయింపు ఇవ్వనున్నట్లు అధికారులు ప్రకటించారు. మందుల దుకాణం, ఆసుపత్రులు మినహా ఏవీ తెరిచి ఉంచరాదని చెప్పారు. వైరస్ లక్షణాలున్నాయని.. మందులివ్వాలని ఎవరైనా అడిగితే వారి చిరునామా, ఫోన్ నంబర్ కలెక్టర్ కార్యాలయానికి పంపించాలని జిల్లాలోని అన్ని మందుల దుకాణాలను ఆదేశించారు. మరోవైపు ఇంటింటా వైద్య బృందాలతో సర్వే చేయిస్తున్నారు.
1430 మంది యువకులతో గల్లీవారియర్స్
ఆదిలాబాద్ జిల్లాలో కరోనా వ్యాధి నియంత్రణ కోసం అధికార యంత్రాంగం గల్లీవారియర్స్ను నియమించింది. ఆదిలాబాద్ పురపాలక సంఘం పరిధిలో వ్యాధి ప్రభావిత ప్రాంతాలైన 19 వార్డుల్లో సామాజిక సేవాభావం కలిగిన 1,430 మంది యువకులను గుర్తించి వారికి బాధ్యతలు అప్పగించింది. ఇక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య 11కి చేరింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా బారికేడ్లతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. వార్డుకు ఒకరి చొప్పున 19 మంది ప్రత్యేక అధికారులను నియమించారు. వీరికి ప్రత్యేక ఫోన్ నంబర్లు ఇచ్చారు. అవి ప్రజలకు తెలిసేలా చూశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఈ అధికారులకు ఫోన్ చేస్తే గల్లీవారియర్స్ వెళ్లి సమస్యను పరిష్కరించేలా ఏర్పాట్లు చేశారు.
1300 మంది వాలంటీర్లతో డోర్ డెలివరీ
ప్రజలు నిత్యావసర సరకుల కోసం దుకాణాల వద్ద బారులు తీరడమే కాకుండా, వ్యక్తిగత దూరాన్ని పాటించడం లేదని గ్రహించిన మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ డోర్ డెలివరీ ద్వారా సరకులు పొందే సౌకర్యాన్ని కల్పించారు. జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛందంగా సేవలందించే 1,300 మంది వాలంటీర్లను నియమించారు. కిరాణా దుకాణాల నిర్వాహకుల వాట్సప్ నంబర్లు ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయించారు. వస్తువుల జాబితాను ప్రజలు వాట్సప్ చేస్తే వాలంటీర్లు సరకులను వారి ఇళ్లకు చేరవేస్తున్నారు. నగదుతో పాటు గూగుల్ పే, ఫోన్పే ద్వారా సొమ్ము చెల్లించే వెసులుబాటు కల్పించారు. సరకులను ఇంటి యజమానికి ఇచ్చిన సమయంలో డోర్ డెలివరీ చేసినట్లు వాలంటీర్లు ఫొటోలు తీసుకుంటున్నారు. మహబూబాబాద్ పట్టణంలో వ్యాపారులంతా సమష్టిగా వర్తక సంఘం భవనం నుంచి నిత్యావసర సరకులను వాలంటీర్ల ద్వారా డోర్ డెలివరీ చేయిస్తున్నారు.
ఇదీ చూడండి: 'రక్తదాతలు ముందుకు వస్తే ఏర్పాట్లు చేస్తాం'