CM Revanth Reddy Delhi Tour : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. ఈ సమావేశం గంటకుపైగా జరిగింది. రాష్ట్రానికి అన్ని రకాలుగా సాయం అందించాలని ప్రధానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర బడ్జెట్లోనూ రాష్ట్రానికి కేటాయింపులు లేవని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని పీఎంను ముఖ్యమంత్రి రేవంత్ కోరారు. మూసీ నది ప్రక్షాళనకు కేంద్రం సహకరించాలని, రాష్ట్రంలోని చెరువుల పునరుద్ధరణకు ఆర్థికసాయం చేయాలని ప్రధానిని సీఎం కోరారు.
ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రి శ్రీధర్ బాబు, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనను పీఎంకు సీఎం వివరించారు. పలు ప్రాజెక్టులకు కేంద్ర సాయాన్ని ముఖ్యమంత్రి కోరారు. విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలను ప్రధానికి సీఎం రేవంత్ వివరించారు. ప్రధానితో భేటీ ముగియడంతో పలువురు కేంద్రమంత్రులను కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది.
ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అపాయింట్మెంట్ సమాచారం రావడంతో ఆయన మంగళవారం రాత్రి దిల్లీ వెళ్లారు. గత ఏడాది జులైలో ప్రధానితో భేటీ అయిన రేవంత్ రెడ్డి దాదాపు ఆరు నెలల తర్వాత మళ్లీ సమావేశం కానున్నారు. ఇటీవల ఎస్ఎల్బీసీ ప్రమాదంపై మోదీ ఆయనతో ఫోన్లో మాట్లాడారు. కాంగ్రెస్ అగ్రనేతలను కలిసి ఎమ్మెల్సీ ఎన్నికలు, పీసీసీ రాష్ట్ర కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంగళవారం రాత్రి సీఎం దిల్లీలోని అధికార నివాసంలో రాష్ట్ర అధికారులతో చర్చించారు.