మిషన్ భగీరథ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ ముషర్రఫ్.. మిషన్ భగీరథ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
జిల్లాలో మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టి పనులు పూర్తి చేయాలన్నారు. కొన్ని గ్రామాలకు ఇప్పటి వరకు బల్క్ వాటర్ మాత్రమే సరఫరా చేయడం జరిగిందని, మిగతా పనులను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించి త్వరితగతిన పూర్తి చేసి ప్రతి ఇంటికి తాగు నీరందించాలని సూచించారు.
అలాగే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి స్థలాలను గుర్తించి పనులను వేగవంతం చేయాలన్నారు. ఇప్పటికే పూర్తి అయినా డబుల్ బెడ్ రూమ్ ల కాలనీలలో విద్యుత్ సరఫరా, రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనులు పూర్తి చేయాలని ముషర్రఫ్ ఆదేశించారు.