ప్రలోభాలకు లొంగి బీమా డబ్బుల కోసం భర్తను హతమార్చిన భార్య ఎంత వరకు సుఖపడుతుందో తెలియదు కానీ... అతన్ని నమ్ముకున్న కుటుంబం సమాజంలో గౌరవం లేక చిన్నచూపుకు నోచుకుంటున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. నవ మాసాలు మోసి, కని పెంచి.. తోడు నీడను ఏర్పరచిన వృద్ధ తల్లిదండ్రులకు బీమా హత్యలతో తిండి పెట్టే వారు లేక బతుకుజీవుడా అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. గతంలో కొండ్రపోలు గ్రామంలో జరిగిన దైద హుసేన్, నిన్న మొన్న జరిగిన కోటిరెడ్డి బీమా హత్య ఘటనలో కూడా చివరకు సమిధలయ్యింది కనిపెంచిన తల్లిదండ్రులు వారి పిల్లలే. కుమారుడిని కోల్పోయి బుక్కెడు బువ్వ పెట్టేవారు లేక, ఆకలికి తట్టుకోలేక ఆత్మాభిమానం చంపుకుని వారి వీరి ఇళ్లల్లో అడుక్కుని తినే పరిస్థితి ఏర్పడింది. బీమా కోసం హత్య చేయబడిన కుటుంబాల్లో నేరుగా కనిపిస్తున్న పరిస్థితి ఈనాడు-ఈటీవీ భారత్ వెలుగులోకి తెచ్చింది.
వివరాల్లోకి వెళితే..
ఇదంతా ఒక ఎత్తైతే.. ఇదో బీమా మాఫియా. అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే కుటుంబానికి ఆసరాగా కోసం జీవిత బీమా చేయించుకుంటారు ఎవరైనా.. కానీ ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధం. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం రాళ్లవాగు తండాకు చెందిన ప్రైవేట్ బీమా ఏజెంట్ అమాయకులకు తెలియకుండానే పాలసీలు చేయించడం, తరువాత వారిని హతమార్చడం, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి నామినీల సహాయంతో బీమా సొమ్మును కొట్టేయడం ఇక్కడ ప్రధాన వ్యూహం. ఇలా దాదాపు రెండేళ్లుగా గుట్టుగా సాగుతున్న ఈ దందాలో ఇప్పటివరకు 10 మంది వరకు అమాయకులను మట్టుబెట్టడం ఆందోళనకరం. మారుమూల తండా ప్రాంతాల్లోని నిరుపేదల పేర్లతో లక్షల్లో పాలసీలు తీసుకుంటున్న.. కొద్ది నెలల్లోనే వారిపై క్లైములు వస్తున్నా బీమా సంస్థలు వాటి గురించి ఆరా తీయకపోవడం లాంటి కారణాల వల్ల ఇప్పటివరకు తెలియరాలేదు.
రోడ్డు ప్రమాదాలుగా చిత్రీకరించి..
కొద్ది నెలల్లోనే అంత పెద్ద మొత్తం చేతులు మారుతున్న బ్యాంకులు ఎందుకు అనుమానించ లేదనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకే మండలంలో తరచుగా రోడ్డు ప్రమాదాల కేసులు నమోదవుతున్నాయి పోలీసులు ఎందుకు పెద్దగా దృష్టి పెట్టలేదన్నది చర్చనీయాంశమైంది. అమాయకులను హతమార్చి రోడ్డు ప్రమాదాలు అంటూ శవాలను తెస్తున్నా.. శవపరీక్ష పరీక్షలు చేసిన వైద్యులు దానిని ఎలా నిర్ధరించారు. ఇవన్నీ ఇప్పుడు తేల్చిన అంశాలు. ఈ దందాలో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరిని నల్లగొండ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీమా పేరిట పలు హత్య జరిగినట్లు నిర్ధరించిన పోలీసులు తమదైన రీతిలో నిందితులను విచారిస్తున్నారు. పోలీసులు పలువురుని అదుపులోకి తీసుకుని సమాచారాన్ని రాబడుతున్నారు.
రూ.50 కోట్లు కొల్లగొట్టారు..
ఈ దందాలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు ఏజెంట్లు గత నాలుగైదేళ్లలో దాదాపు 50 కోట్ల వరకు సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు. దామరచర్ల, రాళ్లవాగు తండా, మిర్యాలగూడ, హైదరాబాద్, మాచర్ల, ఒంగోలుతోపాటు పలు ప్రాంతాల్లో నిందితుల నుంచి విలువైన పత్రాలు స్వాధీనం చేసుకుని ఆ దిశగా పోలీసులు విచారణ చేస్తున్నారు.
వారి కుటుంబాలకు దయనీయ స్థితి
ఇదిలా ఉంటే బీమా హత్యకు గురైన వారు ఏమైనా బాగుపడ్డారా అంటే అది లేదు. వారి కుటుంబం మాత్రం చేరదీసే వారు లేక దేహీ అంటూ తిండి కోసం ప్రాకులాడుతున్నారు. వారిని చూస్తే పలువురికి కలిచివేస్తోంది. బీమా కోసం కన్న కొడుకుని హత్య చేసిన కోడలు. ఇలా అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇకనైనా అలాంటి సంఘటనలు జరగకుండా నిందితులపై పోలీసులు కఠినంగా వ్యవహరించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.