నల్గొండ జిల్లా దేవరకొండ తాలూకా పెద్ద తండా గ్రామానికి చెందిన లోక్య నాయక్ (33)కు శ్వాసకోశ సంబంధిత సమస్య వచ్చింది. దీంతో ఈ నెల 20న హైదరాబాద్ అబిడ్స్లోని ఉదయ్ ఓమ్ని ఆసుపత్రిలో చేర్పించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్యులు చికిత్స ప్రారంభించారని పేర్కొన్నారు. పది రోజుల అనంతరం వైరస్ తగ్గిందని రాత్రి డిశ్చార్జ్ చేస్తామని హాస్పిటల్ సిబ్బంది చెప్పినట్లు వారు పేర్కొన్నారు.
అయితే పెండింగ్లో ఉన్న రూ. ఐదున్నర లక్షలు చెల్లించాలని ఆసుపత్రి సిబ్బంది చెప్పారని.. తాము డబ్బులు సర్దుకొనేందుకు కొంత సమయం కావాలని కోరినట్లు వివరించారు. వారు అడిగినంత డబ్బులు చెల్లించలేదనే కారణంతో.. లోక్య నాయక్కు వైద్యం అదించలేదని సోదరుడు శంకర్ నాయక్ ఆరోపించాడు. అందువల్లే బుధవారం ఉదయం తమ సోదరుడు మృతి చెందినట్లు శంకర్ నాయక్ కన్నీరు పెట్టుకున్నాడు.
ఇప్పటి వరకు రూ. లక్షన్నర కట్టామని.. మిగిలిన డబ్బు చెల్లిస్తేనే మృతదేహాన్ని ఇస్తామనడం వల్ల ఆందోళనకు దిగారు. ఈ ఘటనతో అబిడ్స్ పోలీసులు హాస్పిటల్ వద్దకు చేరుకొని ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడారు. మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించడం వల్ల వారు ఆందోళన విరమించారు.
ఇదీ చదవండి: 'రాంకీ సంస్థకు చెత్త సేకరణ టెండర్ ఇవ్వడాన్ని రద్దు చేసుకోవాలి'