మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని యద్గర్పల్లిలో రైతు వేదిక భవనానికి మంత్రులు మల్లారెడ్డి, నిరంజన్ రెడ్డి భూమి పూజ చేశారు. రైతుల పొలాలకు భూసార పరీక్షలు నిర్వహించిన సర్టిఫికెట్లను అందజేసారు. అనంతరం హరితహారంలో భాగంగా ఇరువురు మంత్రులు మొక్కలు నాటారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం, రైతును రాజును చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకే ప్రభుత్వం రైతు వేదికలను ఏర్పాటు చేసి మరింత చేయూతనిస్తోందన్నారు. రైతులకు పుష్కలంగా నీళ్లు, రైతుబంధు సాయం, గిట్టుబాటు ధర కల్పిస్తూ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు.
రైతులంతా ఒకచోట చేరి వ్యవసాయంపై చర్చించుకునేందుకే, రైతులు సమావేశాలు నిర్వహించుకొనేందుకు, ఇతర అవసరాలకు అనుగుణంగా 2,046 చదరపు అడుగుల్లో ప్రభుత్వం రైతు వేదికను నిర్మిస్తుందని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. రైతు వేదికల్లో అధునాతన సౌకర్యాలు కల్పించడంతో పాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించేందుకు ఇంటర్నెట్ సౌకర్యం, ఇతర అవసరాలను కూడా సమకూరుస్తామని హామీ ఇచ్చారు.