మెదక్ పురపాలికలో మిషన్ భగీరథ ద్వారా మార్చి నెలాఖరు నాటికి ఇంటింటికి నీరందించాలని రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్లో మిషన్ భగీరథ పనులపై సమీక్ష నిర్వహించారు. పట్టణంలో 32 కిలోమీటర్ల మేర పైపులైన్ వేయాల్సి ఉండగా ఇప్పటిదాకా 11 కిలో మీటర్ల మేర మాత్రమే పూర్తి చేశారని తెలిపారు. బ్లూ పైపులైను సరఫరాకు అనుగుణంగా నీటి కుళాయిలు బిగించాలని అధికారులకు సూచించారు.
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇళ్లకు కూడా పైపులైన్ వేయాలని అధికారులకు సూచించారు. పనులు వేగవంతం చేయడానికి పురపాలికను ఆరు జోన్లుగా విభజించి ఆరు మంది ప్రత్యేక అధికారులతో పాటు 32 వార్డులకు వీఆర్వోలను నియమించామని తెలిపారు. వార్డు కౌన్సిలర్ల సహకారంతో వేసవిలోగా తాగునీరు అందించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో స్థానిక శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ చంద్రపాల్, ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి, ఇంజనీరింగ్, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.