వన్యప్రాణులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఖమ్మం జిల్లా సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మనం ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుందని పేర్కొన్నారు. సత్తుపల్లి పోలీసులు కోతుల కోసం ఏర్పాటు చేసిన వానర వనాన్ని ఆయన ప్రారంభించారు. వానలు రావాలంటే కోతులు వాపస్ పోావాలని సీఎం కేసీఆర్ పిలుపు మేరకు... రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా వానర వనాన్ని ఏర్పాటు చేయడాన్ని అభినందించారు.
జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తాప్సీ రెబెల్ ఆదేశానుసారం సత్తుపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో నిరుపయోగంగా ఉన్న ప్రదేశాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. దీనికి కృషి చేసిన సత్తుపల్లి ఏసీపీ వెంకటేష్, సీఐ రమాకాంత్, పోలీసు సిబ్బంది సేవలను ఎమ్మెల్యే ప్రశంసించారు. సత్తుపల్లి పోలీసుల స్ఫూర్తితో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నిరుపయోగ స్థలాల్లో మొక్కలు నాటాలని సూచించారు.
వానర వనంలో మామిడి, జామ, సపోటా, సీతాఫలం వంటి పండ్ల మొక్కలు నాటినట్టు సీఐ రమాకాంత్ తెలిపారు. 300 వరకు మొక్కలు నాటి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, నీటి ఎద్దడి రాకుండా డ్రిప్ సౌకర్యం ఏర్పాటు చేసినట్టు వివరించారు. జీవామృతం తదితర సేంద్రియ సాగు ద్వారా మొక్కలు పెంచనున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎస్సై నరేష్, మున్సిపల్ కమిషనర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.