ఖమ్మం జిల్లా ముదిగొండ పరిధిలోని ఆరెగూడెంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కాగా అతడి కుటుంబసభ్యులను కరోనా పరీక్షలు చేయించుకునేందుకు గ్రామం నుంచి బోదులబండలోని పీహెచ్సీకి తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో సర్పంచి రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి రామారావు కలిసి వారిని పంచాయతీ ట్రాక్టర్లో వైద్యశాలకు తీసుకెళ్లారు. వైద్యశాలలో కరోనా పరీక్షల అనంతరం తిరిగి వారిని ట్రాక్టర్లో ఇంటి వద్ద దింపారు. మామూలు రోజుల్లో పొద్దున లేస్తే.. తీపి మాటలతో కడుపు నింపే చాలామంది నిజ స్వరూపాన్ని కరోనా బయట పెడుతున్నది.
మధిర గ్రామీణ మండలంలోని చిలుకూరులో ఒకే కుటుంబంలో ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వారి కుటుంబంలో ఇంకా ఐదుగురు సభ్యులున్నారు. మిగిలిన వారికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించటం కోసం దెందుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాలి. కానీ.. బంధువులెవరూ ముందుకు రాకపోగా.. గ్రామ సర్పంచ్ తన బాధ్యతగా వారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. అనంతరం భౌతిక దూరం పాటిస్తూ తిరిగి వారిని ఇంటికి చేర్చారు.
కరోనా వారియర్గా కౌన్సిలర్..
కరోనా అంటే భయపడుతున్న ప్రస్తుత తరుణంలో ఇల్లందు పట్టణంలోని 22వ వార్డు కౌన్సిలర్ అంకెపాక నవీన్ కరోనా వారియర్గా మారారు. కరోనా చనిపోయిన వారి మృతదేహాలను సొంతవారే పట్టించుకోని తరుణంలో కౌన్సిలర్ తన వంతు బాధ్యతగా ఈ కష్టకాలంలో జాగ్రత్తలు పాటిస్తూ కరోనా మృతుల అంత్యక్రియలు చేస్తున్నారు. పట్టణంలోని 24వ వార్డుకు చెందిన కీర్తి నర్సయ్య కరోనాతో కొత్తగూడెం ప్రభుత్వ వైద్యశాలలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఆయన మృతదేహాన్ని ఇల్లెందుకు తీసుకొచ్చారు. నర్సయ్య అంత్యక్రియలు చేయడానికి ఎవరూ రాకపోవడంతో, కౌన్సిలర్ నవీన్, తన మిత్రుడు విక్రంతో కలిసి కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అర్ధరాత్రి అంత్యక్రియలు జరిపించారు. ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు. ఎంతోమంది ప్రజా ప్రతినిధులు ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో వారికి అండగా నిలబడి సాయం చేస్తున్నారు. మీకు మేమున్నాం అంటూ ఆపన్నహస్తం అందిస్తూ.. మానవత్వం చాటుకుంటున్నారు.
ఇవీ చూడండి: పారిశ్రామిక పార్కులకు కేంద్ర సహకారం కావాలి: కేటీఆర్