ఖమ్మం జిల్లాలో కరోనా వ్యాప్తి కలకలం రేపుతోంది. తాజాగా సోమవారం ఒక్కరోజే 12 మంది ఈ వైరస్ బారినపడ్డారు. జిల్లా కేంద్రంలోని ఎన్ఎస్టీ రోడ్డుకు చెందిన ఓ వ్యక్తికి ఇటీవల కరోనా సోకగా.. ప్రస్తుతం అతడు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొంతున్నాడు. ఈ నేపథ్యంలో అతని కుటుంబీకులు, ప్రైమరీ కాంటాక్టులు 20 మందికి పరీక్షలు నిర్వహించగా.. వారిలో మరో 8 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది.
జిల్లాలోని తల్లాడ మండలం వెంకటగిరి గ్రామానికి చెందిన ఓ చిన్నారి, ముదిగొండ మండలం మేడిపల్లికి చెందిన ఓ యువకుడు ఈ వైరస్ బారినపడ్డారు. సత్తుపల్లి పట్టణ కేంద్రానికి చెందిన ఓ క్యాన్సర్ బాధితుడు హైదరాబాద్లో చికిత్స తీసుకుంటూ కరోనా బారినపడ్డారు. పెనుబల్లి మండలం కుప్పెనకుంట్లలో మరో మహిళకు పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఈ బాధితులందరికీ ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి ఐసోలేషన్లో చికిత్స అందిస్తున్నారు.