కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుత్రిలో వివిధ జీవోల కింద తాత్కాలిక పద్ధతిపై 62 మంది ఉద్యోగులు పెషెంట్కేర్, సెక్యూరిటీ, ల్యాబ్ టెక్నీషియన్స్, నర్సులు, ఎలక్ట్రీషియన్, డ్రైవర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఉద్యోగుల జీవో గడువు పూర్తి కాగానే జీవోను రెన్యూవల్ చేసి ఉద్యోగులను యథావిధిగా కొనసాగిస్తారు. గడువు ముగిసి అయిదు నెలలు గడుస్తున్నా... నేటికి జీవో రెన్యూవల్ చేయకపోవడంతో.. సకాలంలో ఉద్యోగులకు వేతనాలు అందక నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
నెలల తరబడి వేతనాలు రాకపోవడంతో రూం కిరాయి, నిత్యావసరాల కొనుగోలుకు అప్పులు చేస్తేగాని ఇల్లు గడవని పరిస్థితి నెలకొంది. నెల నెలా జీతం వస్తేనే.. నెల చివరి వరకు తిరిగి అప్పులు చేయక తప్పదు, అలాంటిది ఐదు నెలలుగా వేతనాలు రాకపోవడంతో కొంత మంది ఉద్యోగులకు కుంటుంబాలు గడవటం కూడా కష్టంగా మారింది. తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల అసోసియేషన్ పిలుపు మేరకు కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో తాత్కాలిక పద్ధతిపై విధులు నిర్వహిస్తున్న 62 మంది ఉద్యోగులు గత 11 రోజులుగా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహిస్తున్నారు.
జీవోను రెన్యువల్ చేసి, పెండింగ్ వేతనాలు చెల్లించాలి..
తాత్కాలిక ఉద్యోగుల జీవోలను రెన్యూవల్ చేసి పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కరోనా సీజన్లో కూడా సెలవులు పెట్టకుండా విధులకు హాజరవుతున్నారు. అయిదు నెలలుగా వేతనాలు అందకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీ విధానం రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా ఉద్యోగులకు వేతనాలు ఇస్తే, ఏజెన్సీకి ఇచ్చే కమిషన్ కూడా నేరుగా ఉద్యోగులకే అందుతుంది.
-ఎం.డి అజ్గర్ పాషా, అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు
ఇంటి కిరాయి కట్టలేక పోతున్నాం...
గత అయిదు నెలలుగా వేతనాలు రాకపోవడంతో ఇంటి కిరాయి, నిత్య అవసరాల కొనుగోలుకు అప్పులు చేయాల్సి వస్తోంది. కరోనా విపత్తులో కూడా శాశ్వత ఉద్యోగులకు సమానంగా, సెలవులు పెట్టకుండా విధులు నిర్వహిస్తున్నాం. పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించి ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
-స్వప్నరాణి, స్టాఫ్నర్సు, జిల్లా ఆసుపత్రి