స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ఎందరు ముఖ్యమంత్రులు మారారని.. కానీ ఎవ్వరూ ఆడబిడ్డ కన్నీళ్లు తుడవలేదని.. కేసీఆర్ సీఎం అయ్యాకే కల్యాణలక్ష్మి పథకం ద్వారా పేదింటి ఆడబిడ్డలను ఆదరించారని మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో 260 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. గతంలో ఆడబిడ్డల పెళ్లికి ఆస్తుల్ని తాకట్టుపెట్టి అనేక ఇబ్బందులు పడ్డామని, ఆ ఆడబిడ్డల కన్నీళ్లు తుడవడం కోసం, పేద, బడుగు, బలహీన వర్గాల జీవితాలు మార్చడం కోసం తెలంగాణ రావాలని, ప్రత్యేక రాష్ట్రం వస్తేనే మన బతుకులు మారుతాయని తెలంగాణను కేసీఆర్ సాధించారని మంత్రి గుర్తుచేశారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన పరిపాలన కొనసాగుతోందన్నారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి అద్భుత పథకాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు అండగా నిలబడ్డారన్నారు. ముఖ్యమంత్రికి మంత్రి గంగుల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇల్లు నవ్వితే పల్లె, పల్లెనవ్వితే తెలంగాణ, తెలంగాణ నవ్వుతూ ఉంటే కేసీఆర్ సంతోషపడతారని పేర్కొన్నారు. అనేక దేశాలు, మనదేశంలోని అనేక రాష్ట్రాలు ఏవి అందించని కల్యాణలక్ష్మి లాంటి పథకాల్ని తెలంగాణ అందిస్తుందని, కేసీఆర్ ఆధ్వర్యంలో గణనీయ ప్రగతిని రాష్ట్రం సాధిస్తుందన్నారు.
ఇదీ చదవండి: Bandi Sanjay : 'నియంత పాలన నుంచి ఈటలకు విముక్తి'