కరీంనగర్ నగరంలో ఫంక్షన్హాల్స్ యజమానులకు కోతులతో పెద్ద తలనొప్పిగా మారింది. ఇళ్ల వద్ద ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటుండటంతో వేడుక వేదికలను అడ్డాగా మార్చుకుంటున్నాయి. ఒకేసారి 30 నుంచి 40 దూసుకొస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. అడవులు తగ్గడం, పండ్లు, ఫలాలు దొరికే పరిస్థితి లేకపోవడంతో నగరంలోకి దండు కడుతున్నాయి.
అంతటితో ఆగకుండా..
రాత్రిపూట వచ్చి ఫంక్షన్హాల్స్లో మకాం వేస్తున్నాయి. అంతటితో వాటి ఆగడాలు ఆగడం లేదు. వంట చేయనీయకుండా అడ్డుపడుతున్నాయి. భోజనం చేయకుండా ప్లేట్లు ఎత్తుకెళ్తున్నాయి. జనం పట్ల నానా రభస చేస్తున్నాయి. దీనితో కోతుల బెడదను తట్టుకోలేక యజమానులు కొండెంగలను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దాడిచేస్తూ..
కలెక్టరేట్ ప్రాంతంలో చెట్లు అధికంగా ఉండటంతో కోతులు ఎక్కువగా అక్కడే కన్పిస్తున్నాయి. ఎవరైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా ఆటంకం సృష్టిస్తున్నాయి. వంట సామగ్రి, కూరగాయలు ఎత్తుకెళ్తున్నాయి. జనాలపై దాడిచేసి గాయపరుస్తున్నాయి. వంట చేసేవారిని బయపెడుతుండటంతో యజమానులు ప్రత్యమ్నాయంగా కొండెంగలపై దృష్టి పెట్టారు.
పహారా కాయాలి..
కోతులతో తిప్పలు ఇప్పట్లో తగ్గేలా లేవని భావించిన యజమానులు కోడెంగలను తీసుకొస్తున్నారు. ఈ ఉపాయం కలిసొచ్చి వాటి బెడద తగ్గుతోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక వాటిని నిరంతరం కాపాడుకోవడానికి శ్రమించాల్సి వస్తోందని నిర్వాహకులు అంటున్నారు. ఫంక్షన్ హాల్లో కోడెంగలను ఎప్పడూ పట్టుకొని పహారా కాయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని చెబుతున్నారు.
రోజుకు వెయ్యి..
మియావాకి అడవుల్లో చెట్ల కొమ్మలు విరగ్గొట్టకుండా ఉండేందుకు అక్కడికి ఒక కొండెంగను పోలీసులు తీసుకొచ్చారని పర్యవేక్షకులు తెలిపారు. అది కోతులను చూడగానే అరిచి గోల పెడుతుందని చెెబుతున్నారు. దానికి ప్రతీరోజు కూరగాయలు, పండ్లు ఆహారంగా పెడుతున్నామని అంటున్నారు. దీనికి రోజుకు దాదాపు రూ.1000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని వివరిస్తున్నారు.
కుక్కలను అదుపు చేసేందుకు కుటుంబ నియంత్రణ చేపట్టినట్లుగానే.. కోతులపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని నగరపాలక సంస్థకు స్థానికులు సూచిస్తున్నారు.
ఇదీ చూడండి: రేపు రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్కు ఏర్పాట్లు