కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని పేదలకు 2008లో అప్పటి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు అందజేసింది. 672 సర్వే నంబరులోని రెండు ఎకరాల్లో ఇళ్లు నిర్మించుకోవడానికి 40 మందికి స్థలాలు కేటాయించారు. ఇందులో కొంత స్థలంలో ప్రభుత్వ కార్యాలయాల భవనాలు నిర్మించారు. ఇళ్ల స్థలాల పంపిణీలో బీడీ కార్మికులకు ప్రాధాన్యం ఇస్తూ పట్టాలు అందజేశారు. కొందరు ఇళ్ల నిర్మాణం చేపట్టారు. పట్టణంలో బీడీ పరిశ్రమలు మూతపడటంతో ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు.
పత్రాలు కొని పేర్లు మార్పించి
పట్టణ నడిబొడ్డున ఉన్న ఖాళీ స్థలంపై కన్నేసి కొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లిన లబ్ధిదారులను మచ్చికచేసుకొన్నారు. వారికి కొంత డబ్బులు ఇచ్చి ఇంటి పత్రాలు తీసుకొంటున్నారు. అందులో పేర్లు మార్పించి నోటరీ చేయిస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వం అందించిన స్థలంలో మూడేళ్లలో నిర్మాణం చేపట్టాలి. లేదంటే వెనక్కి తీసుకొనే అధికారం ప్రభుత్వానికి ఉంది. దీన్ని ఆసరా చేసుకొని కొందరు వారి వద్ద పత్రాలు తీసుకొని పేర్లు మార్పించి రాత్రి రాత్రికే పునాదులు నిర్మిస్తున్నారు. గతంలో 40 మందికి పట్టాలు ఇస్తే ఇప్పుడు వందల మంది పేర్లు ఉన్నాయి.
పురపాలికలో భూ వివరాలేవట
కొత్తగా ఏర్పాటైన పురపాలికలో ప్రభుత్వ భూముల సమాచారం లేకపోవడం గమనార్హం. నిబంధనల ప్రకారం విలీన పంచాయతీలతో పాటు బల్దియా పరిధిలోని ప్రభుత్వ, దేవదాయ, అటవీ శాఖల భూ వివరాలతో పాటు ప్రజావసరాలకు కేటాయించిన భూముల వివరాలను రెవెన్యూ అధికారులు తెలియజేస్తూ దాఖలు చేయాల్సి ఉంటుంది. పురపాలక సంఘం ఏర్పాటై రెండేళ్లు పూర్తవుతున్నా ఈ ప్రక్రియ పూర్తికాకపోవడం గమనార్హం.
నా జాగాను కబ్జా చేశారు...
![](https://assets.eenadu.net/article_img/06KMR04.jpg)
అప్పటి ప్రభుత్వం ఇంటి నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని కొందరు అక్రమార్కులు కబ్జా చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారు. అధికారులు ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలుఇంటి స్థలం ఉన్నోళ్లే మరి కొంత స్థలం ఆక్రమించుకుంటున్నారు. నా దగ్గర ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలం పత్రం ఉన్నప్పటికీ నా స్థలం కాదంటూ జులుం చేస్తున్నారు. నిరుపేదలకు కేటాయించాలి.
![](https://assets.eenadu.net/article_img/06KMR05.jpg)
ఇంటి స్థలాలు లేని నిరుపేదలకు ప్రభుత్వ భూములను కేటాయించాలి. ఇప్పటికే ఇళ్ల నిర్మాణం చేసుకున్న వారు దొంగపత్రాలతో ప్రభుత్వ భూములను కాజేసేందుకు ప్రయత్ని స్తున్నారు. ఇదంతా అధికారులకు తెలిసే జరుగుతోంది. పురపాలక శాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తే ఆయా భూములు తమ పరిధిలో లేవంటున్నారు. రెవెన్యూ అధికారులకు తెలియజేస్తే చర్యలు తీసుకుంటామంటున్నారు.
ప్రభుత్వ స్థలంలో ఆక్రమంగా నిర్మాణాలు చేసుకున్న విషయం మా దృష్టికి వచ్చింది. వెంటనే రెవెన్యూ సిబ్బందిని పంపించి ఆక్రమణలు తొలగిస్తాం. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే కేసులు నమోదు చేసేందుకు వెనకాడం. నిబంధనల మేరకు ఇంటి స్థలం పత్రాలున్న వారు మాత్రమే పురపాలక సంఘం అనుమతులు తీసుకుని నిర్మాణాలు చేసుకునేందుకు అర్హులు.
- శ్రీను, ఆర్డీవో, ఎల్లారెడ్డి
ఇదీ చదవండి: ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య- కారణమేంటి?