రైతులకు మేలు చేసే వ్యవసాయ చట్టాలనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. రైతులు తమ పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చునని పేర్కొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కాలూర్ తిమ్మన్ దొడ్డి మండలం నందిన్నె గ్రామం నుంచి పత్తి, ఇతర పంటలను రాయచూరులో అమ్ముకోవడానికి వెళ్తున్న వాహనాలకు జెండా ఊపారు.
రైతు కోసమే...
ప్రధాని మోదీ పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టే రైతుల మేలు కోసం ఈ వ్యవసాయ చట్టాలని తీసుకువచ్చారని అన్నారు. దేశంలో ఎక్కడ ఎక్కువ ధరలు ఉంటే అక్కడికి తీసుకెళ్లి అమ్ముకోవచ్చునని తెలిపారు. గతంలో గద్వాల రైతులు తమ పంటలను అమ్ముకోవాలంటే చాలా ఇబ్బందులు పడేవారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని... కొత్త చట్టాల పట్ల రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని అరుణ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేస్తాయి: జేపీ