జనగామ జిల్లా చిల్పూర్ మండలం నష్కల్ గ్రామానికి చెందిన ఓ ఆర్టీసీ డ్రైవర్కు కరోనా సోకింది. ఈ డ్రైవర్ లాక్డౌన్ కాలంలో మే 10 వరకు ఎంజీఎం ఆస్పత్రి సిబ్బందిని తరలించడానికి ఏర్పాటు చేసిన బస్సును నడిపినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ తర్వాత నుంచి జ్వరం, గొంతునొప్పి వంటి అనారోగ్య సమస్యలతో సెలవులో వెళ్లారు. మే నెల 15న ఛాతిలో నొప్పి రావడం వల్ల వరంగల్-ములుగు రోడ్డులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు.
అక్కడ వైద్య ఖర్చులు ఎక్కువవుతుండటం వల్ల మే 29న హైదరాబాద్ తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ నుంచి మరో కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లగా.. వారు కొవిడ్ అనుమానంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించగా.. ఆదివారం పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తమకు సమాచారం వచ్చిందని జిల్లా డిప్యూటీ డీఎంహెచ్వో అశోక్కుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతం డ్రైవర్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆయన వివరించారు. ఆయన కుటుంబ సభ్యులను క్వారంటైన్కు తరలించినట్లు మండల వైద్యాధికారులు తెలిపారు. గ్రామంలో వైరస్ నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.