జనగామ జిల్లా స్టేషన్ఘనపూర్ నియోజకవర్గం రాష్ట్రానికి ఇద్దరు ఉపముఖ్యమంత్రులను అందిస్తే వారు ఈ ప్రాంత అభివృద్ధిని విస్మరించారని పీసీసీ సభ్యుడు అమృతారావు విమర్శించారు. స్టేషన్ ఘనపూర్లో కాంగ్రెస్ నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి కాంగ్రెస్ తరఫున ఎన్నికైన పాలక వర్గాన్ని పూలమాలలతో ఆయన సత్కరించారు. రైతులకు సాగునీరు అందించే వరద కాలువల నిర్మాణాన్ని గాలికి వదిలేసి... కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారని ప్రభుత్వాన్ని ఆయన దుయ్యబట్టారు.
జలదీక్షకు వెళ్తున్న తమ నాయకులను కడియం శ్రీహరి విమర్శించడం సరికాదన్నారు. కడియం రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నపుడు ఇక్కడ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయలేకపోయారని అన్నారు. రాజకీయ జన్మనిచ్చిన స్టేషన్ ఘనపూర్ను ఎప్పటికీ మర్చిపోను అని చెప్పుకునే రాజయ్య... తాను ఉప ముఖ్యమంత్రిగా, ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గానికి వంద పడకల ఆసుపత్రి తేలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు.
ఇదీ చూడండి: కరోనాపై మీరు చేస్తున్నది సరిపోదు.. సర్కారుకు హైకోర్టు కీలక ఆదేశాలు