సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల జిల్లాలో పర్యటించారు. జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసుల గురించి జిల్లాస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రవి, ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, సుంకె రవిశంకర్, జిల్లా పరిషత్ ఛైర్మన్ దావ వసంత తదితరులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఓ వైపు వర్షాలు, మరోవైపు కరోనా కేసులతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి ప్రజల భయాందోళనను తొలగించాలని సూచించారు. ధర్మపురిలో కొవిడ్ కేసులు పెరిగాయని, ఆగష్టు 18న రెండు ర్యాపిడ్ బృందాలు వెళ్లి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్ టెస్టుల సంఖ్య పెంచాలని సూచించారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల కూడా మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. పెరుగుతున్న వరద నీటి ప్రవాహంతో చెరువులు, కుంటలు, వాగులు తెగే ప్రమాదం ఉందని, అలాంటి వాటిని ముందే గుర్తించి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల పట్ల అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ.. జాగ్రత్తగా ఉండాలన్నారు. పాతకాలం నాటి ఇళ్లు, శిథిలావస్థలో ఉన్న ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉందని, ప్రాణనష్టం జరగకుండా ముందే అలాంటి ఇళ్లను గుర్తించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచనలు చేశారు.

జిల్లా కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. ఏడీఐపీ పథకం ద్వారా జిల్లాలో మొత్తం 389 మంది దివ్యాంగులకు ట్రైసైకిళ్లు మంజూరు కాగా.. మంత్రి ఆధ్వర్యంలో 50 మందికి అందజేశారు. త్వరలోనే మిగతా సైకిళ్లు కూడా విడతల వారిగా లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఛైర్మన్ దావ వసంత , జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జగిత్యాల మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ బోగ శ్రావణి, జిల్లా కలెక్టర్ రవి, అదనపు కలెక్టర్ కలెక్టర్ రాజేశం, ఆర్డీవో మాధురి, సంక్షేమశాఖ అధికారి నరేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : 'మెడికల్ హబ్గా హైదరాబాద్ మహానగరం'