జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని పోచమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ప్రతి ఏటా శీతాకాలం చివరిలో అమ్మవారికి చలి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పట్టణంలోని పోచమ్మ ఆలయానికి ఆదివారం తెల్లవారుజామునుంచే భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లలో బారులు తీరారు.
ఇలా చేస్తారు
మహిళలు ముందు రోజు రాత్రి తలస్నానం చేసి నూతన దుస్తులు ధరించి అమ్మవారికి అన్నం వండుతారు. మర్నాడు తెల్లవారుజామున తలంటుకొని నూతన దుస్తులు ధరించి రాత్రి వండిన అన్నంలో పెరుగు కలిపి చలి బోనంగా అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. ఇలా చేయడం ద్వారా వారి వారి కుటుంబాలను పోచమ్మ తల్లి చల్లగా చూస్తుందని, పాడిపంటలు సమృద్ధిగా ఉండేలా చేస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
తెల్లవారుజామునుంచే పిల్లాపాపలతో కుటుంబ సమేతంగా గుడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని, నైవేద్యం సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
ఇదీ చదవండి: భద్రాద్రిలో వైభవంగా రామదాసు జయంతి ఉత్సవాలు