రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. సన్నరకం పంట ధాన్యం క్వింటాలుకు రూ. 2500 రూపాయలు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు.
నైతికత నిరూపించుకోవాలి..
కేంద్రం ధాన్యానికి మద్దతు ధర కల్పించడంలో విఫలమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత పంటల సాగు విధానం పేరిట రైతులను నియంత్రిస్తోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. రైతుబంధు పథకాన్ని నీరుగార్చి పెట్టుబడి రాయితీలు తొలగిస్తూ ఏ విధంగా రైతుల సంక్షేమానికి పాటుపడతారని రాష్ట్ర సర్కార్ను ప్రశ్నించారు. పంట ధాన్యం విక్రయంలో.. రైతుల ఇబ్బందులను ఉటంకిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నైతికతను జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
రూ.2500 ఇవ్వకుంటే కుట్రగా భావిస్తాం !
కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల జలాలతో ఆరుతడి పంటల సాగు ఎలా సాధ్యమన్నారు. వ్యవసాయ రంగానికి కల్పించే దీర్ఘకాలిక, మధ్యకాలిక రుణాలకు రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి రాయితీలు ఇవ్వలేదన్నారు. సన్న రకం ధాన్యానికి మద్దతు ధర పెంచి క్వింటాలుకు రూ.2500 రూపాయలు ప్రకటించాలన్నారు.