ఏపీలోని విశాఖ నగరానికి చెందిన వైశాలీ కులకర్ణి మోరే అనే ఓ మహిళ ద్విచక్రవాహనంపై వేలాది కిలో మీటర్లు ప్రయాణిస్తూ... పలు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఆమె స్ఫూర్తితో నగరంలోని మరో 17 మంది మహిళలు కూడా ఆమె బాటలోనే పయనిస్తున్నారు. వారంతపు విరామ సమయాల్లో వారందరూ కలిసి వాహనాలపై ప్రయాణిస్తూ.. సేవాకార్యక్రమాల్ని నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
బాల్యం నుంచే బైక్లపై మక్కువ ఎక్కువ
మహారాష్ట్రలోని పూణే నగరానికి చెందిన వైశాలీకి చిన్ననాటి నుంచి వాహనాలు నడపడం అంటే చాలా ఇష్టం. 17వ ఏట నుంచే బురద రహదారులు, విన్యాసాలు చేస్తూ వాహనం నడపడం వంటి సాహసాలు చేసేవారు. ఆ తరువాత వివాహం కావడం కారణంగా స్వస్తి చెప్పేశారు. ఆమె భర్త హరీశ్ మోరే తీర రక్షక దళంలో పని చేయడం వల్ల విభిన్న ప్రాంతాల్లో నివసించి.. చివరికి విశాఖలో స్థిరపడ్డారు. 17 ఏళ్లపాటు ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తించారు. 5 ఏళ్ల నుంచి ద్విచక్రవాహనంపై వివిధ ప్రాంతాలు తిరుగుతూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 53 ఏళ్ల వయస్సులో కూడా ఎంతో ఉత్సహంగా బైక్పై ప్రయాణిస్తూ.. సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆమెను పలువురు ప్రశంసిస్తున్నారు.
సరదా వ్యాపకానికి సేవలను జోడించి...
తన వాహనంపై తిరుగుతూ పలువురితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటారు వైశాలీ. వారి అభిప్రాయాల్ని వీడియో తీసి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తారు. వాటికి మంచి స్పందన వచ్చింది. కష్టాల్లో ఉన్నవారికి కొందరు ఆర్థిక సాయం కూడా చేస్తుండేవారు. ఆమె ద్విచక్రవాహనంపై ఇప్పటికే 17 రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలు తిరిగారు. భీమవరం, కొండపల్లి, విజయవాడ,ఏటికొప్పాక, ఉప్పాడ, అరకు, ఒంగోలులతో పాటు కన్యాకుమారి, పాండిచ్చేరి, గోవా వంటి ప్రాంతాలన్నింటినీ చుట్టి వచ్చారు. కొండపల్లి, ఏటికొప్పాక, ఉప్పాక, బొబ్బిలి... ప్రాంతాల్లో వృత్తి కళాకారుల సమస్యలు తెలుసుకున్నారు. 33 వేల కి.మీ.ల దూరం తిరిగిన సోలో బైక్ రైడర్గా ఆమె గుర్తింపు పొందారు.
క్యాన్సర్పై అవగాహనా కార్యక్రమం..
వైశాలీ కులకర్ణి విశాఖ నుంచి కన్యాకుమారి, గోవా పర్యటనలకు సుప్రియా గోయల్ అనే మహిళతో కలిసి వెళ్లారు. సుప్రియ క్యాన్సర్ను జయించిన మహిళ కాగా, వైశాలీ పింకథాన్ అంబాసిడర్గా కూడా సేవలందిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు మార్గమధ్యంలో ఒంగోలు, గూడూరు, కన్యాకుమారి... వంటి ప్రాంతాల్లో పలువురు మహిళలకు క్యాన్సర్పై అవగాహన కల్పించారు. "నాది, ఆమెది కూడా 'అవెంజర్' వాహనాలే. దీంతో మాఇద్దర్నీ 'అవెంజర్ గల్స్' అని పిలుస్తుంటారు" అని అంటోంది సుప్రియ .
తనలా మరికొంత మంది...
తన లాగా మరికొంత మంది మహిళలు కూడా ద్విచక్రవాహనాలపై వివిధ ప్రాంతాలకు తిరుగుతూ సేవా కార్యక్రమాలు చేపట్టాలని వైశాలీ కులకర్ణి భావించారు. ‘ఉమెన్ ఇంటర్నేషనల్ మోటార్ సైకిల్ అసోసియేషన్ (వీమా) అనే అంతర్జాతీయ సంస్థ విభాగాన్ని విశాఖలో ప్రారంభించారు. పలువురి మహిళలతో తన ఆలోచనల్ని పంచుకుని వీమాలో భాగస్వాములుగా చేర్చారు. వైశాలీ కులకర్ణికి మరో 17 మంది కూడా తోడవడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే మహిళలందరూ కలిసికట్టుగా వెళ్లడానికి అవకాశం ఉంటోంది. ఒకరి అభిప్రాయాల్ని మరొకరితో పంచుకుని వారి ప్రయాణాన్ని ప్రయోజనకరంగా, సురక్షితంగా మార్చుకుంటున్నారు. కలిసికట్టుగా సేవా కార్యక్రమాలను నిర్వహించగలుగుతున్నారు.
భద్రతతో కూడిన ప్రయాణం...
దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా అత్యధిక సామర్థ్యం ఉన్న వాహనాలపై అత్యంత బాధ్యతారాహిత్యంతో, ప్రమాదకరంగా, ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించేలా వాహనాలు నడిపేవారే కనబడుతుంటారు. వాహనం అంటే ఇష్టం ఉన్నవారు వాటిని ఉపయోగించుకుని సమాజానికి మంచి చేయాలన్నది వీమా సభ్యుల నమ్మకం. వాహనాన్ని నిబంధనల ప్రకారం, అత్యధిక భద్రత ఉండేలా వీమా సభ్యులందరూ అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. సేవా కార్యక్రమాల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు 'రైడింగ్ గేర్' వేసుకునే వాహనాలపై ప్రయాణిస్తారు. మోకాళ్లు, మోచేతులు, పాదాలు, అరచేతులు, నడుము భాగం తదితర అన్నిచోట్లా గార్డులు ఉండే పూర్తిస్థాయి 'రైడింగ్ గేర్' ధరిస్తారు. ఫలితంగా ప్రమాదం జరిగినా శరీరానికి అయ్యే గాయాలు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.
పని ఒత్తిడి నుంచి విశ్రాంతి పొందడానికి, వినూత్నమైన సేవా కార్యక్రమాలపై ఆసక్తితోనూ వారు వాహనాలపై వివిధ ప్రాంతాలకు వెళ్లడాన్ని వ్యాపకంగా మార్చుకున్నారు. ఇలాంటి ప్రయాణాలు, సేవా కార్యక్రమాలు మహిళల్లో కొత్త ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయని విశ్వసిస్తున్నారు.
ఇదీ చదవండీ: దట్టంగా పొగమంచు.. జాగ్రత్తలతో అధిగమించు