తమ సంస్థ ఉద్యోగులకు ఆటంకం కల్గించొద్దని ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయని... ఎమర్జెన్సీ సేవలన్నింటికీ మినహాయింపు ఉందని గుర్తు చేశారు. అందులో భాగంగానే విద్యుత్ సరఫరా చేసే విద్యుత్ సంస్థకు, సంస్థలో పనిచేసే ఉద్యోగులకు మినహాయింపు ఉందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో విద్యుత్ నిరంతరం సరఫరా జరగాలంటే విద్యుత్ అధికారులు, లైన్మెన్లు నిరంతరం పని చేయాల్సి ఉంటుందన్నారు. వారు విధులకు వెళ్లి వచ్చే క్రమంలో పోలీసులు ఆపి.. కొడుతున్నారని తమ దృష్టికి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. దయచేసి విద్యుత్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల విధులకు ఆటంకం కల్గించొద్దన్నారు. ఉద్యోగులు డ్యూటీకి వెళ్లే సమయంలో వారి ఐడి కార్డ్ అడిగితే చూపించాలన్నారు. ప్రభుత్వం చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని అందరం కలిసి కట్టుగా పనిచేసి కరోనా మహమ్మారిని తరిమికొడుదామన్నారాయన.