హైదరాబాద్ నడిబొడ్డులోని మంగళహాట్ పీఎస్ పరిధిలోని ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా నకిలీ టీ పౌడర్ తయారు చేస్తున్న ఏడుగురి ముఠాను పశ్చిమ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 425 కిలోల టీ పొడిని స్వాధీనంచేసుకున్నారు. గత కొన్ని నెలలుగా బయట నాసిరకం టీ పొడి తెచ్చి వాటిని రసాయనాలతో కలిపి తయారు చేస్తూ మార్కెట్లో పేరు కలిగిన బ్రాండ్ల కవర్లలో నింపి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీటిని హైదరాబాద్తో పాటు వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు తెలిపారు.
వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కల్తీ టీ పొడితో పాటు పలు బ్రాండ్ల టీ పొడి కవర్లను, లేబుళ్లు, స్టాంపులు, అల్యూమినియం కవర్లు, తయారు చేసే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు. వీరితో పాటు వేరే చోట ఇలాంటి తయారీ కేంద్రాలు ఉన్నాయా అనే దానిపై ఆరా తీస్తున్నారు.