మూసీనది ప్రక్షాళనకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధి సంస్థ ఛైర్మన్ సుధీర్రెడ్డి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్లు, జీహెచ్ఎంసీ అధికారులు, జోనల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. బాపూఘాట్ నుంచి నాగోల్ వరకు 22 కిలోమీటర్ల పొడవునా మూసీ నది జలాల శుద్ధికి వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సీజన్ వర్షాకాలం ప్రారంభం అయ్యేలోగా మూసీ క్లీనింగ్ చేయాలని చెప్పారు. ప్రధానంగా మూసీలో ఉన్న మురికి గుంటలు, చెత్తా చెదారం, ఇతర వ్యర్థాలను తీసేందుకు వీలుగా ప్రతి కిలోమీటర్కు ఒకటి చొప్పున ఇటాచీ, ఎక్సావేటర్, జేబీసీ యంత్రాలను వినియోగించి షిఫ్ట్ పద్ధతుల్లో పనులను నిర్వహించాలని సూచించారు.
డ్రోన్ల ద్వారా స్ప్రే..
మూసీ వెంట దోమల వ్యాప్తి నిరోధించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అందుకోసం ఫాగింగ్ మిషన్లు, డ్రోన్ల ద్వారా స్ప్రే చేసే విధానాలను అమలు చేయాలని తెలిపారు. ఈ మేరకు మూసీ వెంట వినియోగించేందుకు ఎన్ని డ్రోన్లు అవసరం పడతాయో సంబంధిత జోనల్ కమిషనర్లు అంచనా వేయాలని వారు సూచించారు. శాశ్వత ప్రాతిపదికన డ్రోన్ల వినియోగానికి వీలుగా ఎస్సీ, ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్లకు రుణాల ద్వారా డ్రోన్లను కొనుగోలు చేసి జీహెచ్ఎంసీ ద్వారా వాటిని వినియోగించాలన్నారు.
ఇదీ చూడండి : జూన్ రెండోవారంలో రాష్ట్రంలోకి రుతుపవనాలు