నేడు భాజపా ఆధ్వర్యంలో తెలంగాణ జన్ సంవద్ పేరుతో వర్చువల్ ర్యాలీ నిర్వహించనున్నారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వర్చువల్ ర్యాలీని భాజపా నిర్వహిస్తోంది. ఈ వర్చువల్ ర్యాలీ వేదికగా మోదీ ఏడాది పాలన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.
సాయంత్రం 4 గంటల 30నిమిషాల నుంచి 5 గంటల 30నిమిషాల వరకు వర్చువల్ ర్యాలీ జరగనుంది. కరోనా పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని వర్చువల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. ఈ ర్యాలీలో పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ జన్ సంవద్ ర్యాలీ పేరిట నిర్వహించే కార్యక్రమాన్ని ఆన్లైన్ వేదికల ద్వారా వీక్షించాలని సూచించారు. భాజపా తెలంగాణ సామాజిక మాధ్యమాల ద్వారా జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాశ్ నడ్డా అందించే సందేశం వినాలన్నారు.
కరోనా పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఆన్లైన్ ద్వారా భావాల్ని పంచుకోవాల్సిన అవసరముందన్నారు. ఏడాది పాలనలో మోదీ ప్రభుత్వం తెలంగాణకు అందించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కరోనా పరిస్థితుల్లో తీసుకున్న చర్యలపై జేపీ నడ్డా దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని చెప్పారు. వర్చువల్ ర్యాలీకి సంబంధించి వారం రోజులుగా శ్రేణుల్ని సన్నద్ధం చేసినట్టు బండి సంజయ్ తెలిపారు. టెలీ, వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా సమాచారం చేరవేసినట్టు పేర్కొన్నారు.
వర్చువల్ ర్యాలీపై గ్రామగ్రామాన అవగాహన కలిగించేందుకు కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. దిల్లీ నుంచి జాతీయ అధ్యక్షులు నడ్డా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర కార్యాలయం నుంచి బండి సంజయ్ వర్చువల్ ర్యాలీలో పాల్గొననున్నారు.
ఇదీ చూడండి: యుద్ధ వ్యూహాలతో శత్రు దేశాలను ఎదుర్కొందాం : సీఎం కేసీఆర్