ఏపీ నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానన్న రియల్ హీరో సోనూసూద్.. మాట నిలబెట్టుకున్నారు. సొంత ఖర్చులతో ఆక్సిజన్ ప్లాంట్ను కొనుగోలు చేసి నెల్లూరుకు పంపించారు. ఈ ప్లాంట్ను ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్లాంట్ ఇప్పటికే.. రోడ్డు మార్గాన బయలుదేరిందని, రెండు వేల కిలోమీటర్లు ప్రయాణించి వారం రోజుల్లో ఆత్మకూరుకు చేరుకుంటుందని సోనూసూద్ మిత్రులు తెలిపారు.
త్వరలో మరికొన్ని రాష్ట్రాల్లో..
ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఆక్సిజన్(OXYGEN) ప్లాంట్లు పెట్టనున్నట్లు హామీ ఇచ్చారు సోనూసూద్. ఏపీలోని నెల్లూరు, కర్నూలు నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. త్వరలో తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, ఉత్తరాఖండ్, తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్లో సహా పలు రాష్ట్రాల్లో సోనూ, ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు.
కరోనా సంక్షోభం ప్రారంభమైన నాటి నుంచి దేశవ్యాప్తంగా ఎంతో మందికి సోనూ సేవలు అందిస్తూనే ఉన్నారు. గతేడాది వలస కూలీల కోసం ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేసిన ఈ రియల్ హీరో.. ఇప్పుడు కరోనా బాధితుల కోసం ఆక్సిజన్ సిలిండర్లు, మందులను సరఫరా చేస్తున్నారు. సోషల్మీడియా వేదికగా తనని సాయం కోరిన ప్రతి ఒక్కరికీ ఆయన ఆపన్నహస్తం అందిస్తున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 917 కరోనా కేసులు, 10 మరణాలు