హైదరాబాద్ నగరాన్ని మహబూబ్నగర్ , కర్నూల్ , అనంతపురం , బెంగళూరు , కడప , తిరుపతి వంటి ప్రధానమైన పట్టణాలకు రైలుతో అనుసంధానం చేయడంలో దక్షిణ మధ్య రైల్వే మరో మైలురాయిని చేరింది. ఈ ప్రాజెక్ట్ నిర్వహణలో భాగంగా షాద్ నగర్ - గొల్లపల్లి మధ్య డబ్లింగ్ రైలు మార్గం పనులు పూర్తిచేసి సెప్టెంబర్ 16న దమ.రైల్వే ప్రారంభించింది. ఈ పనులు రైల్వే పీఎస్యూ, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఎస్ఎల్ ) ఆధ్వర్యంలో చేపట్టింది.
మరింత బలోపేతం కోసం..
తెలంగాణలో రైళ్ల నిర్వహణ మరింత బలోపేతం చేసే దిశగా చేపట్టిన ప్రాజెక్టుల్లో సికింద్రాబాద్ - మహబూబ్ నగర్ డబ్లింగ్, విద్యుదీకరణ ప్రాజెక్ట్ చాలా కీలకమైనది. 2015-16లో 85 కి.మీ. నిడివిగల ఈ ప్రాజెక్టు రూ.774 కోట్ల అంచనా వ్యయంతో మంజూరైంది. సికింద్రాబాద్ - ఉందానగర్ సెక్షన్లో డబ్లింగ్, విద్యుదీకరణ పనులు ఎమ్ఎమ్టీఎస్ ఫేజ్ -1, 2 ప్రాజెక్ట్లో భాగంగా చేపట్టడం వల్ల, సెక్షన్లో మిగిలిన ఉందానగర్ - మహబూబ్నగర్ భాగం డబ్లింగ్, విద్యుదీకరణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి.
ఇదో మైలురాయి..
ప్రస్తుతం సికింద్రాబాద్ - మహబూబ్ నగర్ మధ్య డబ్లింగ్ ప్రాజెక్ట్లో భాగంగా షాద్ నగర్- గొల్లపల్లి మధ్య 29 కిమీ నిడివిగల నూతన డబుల్ లైన్ను ప్రారంభించడాన్ని మైలురాయిగా భావిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఆనందం వ్యక్తం చేసింది.
స్టేషన్ యార్డుల ఆధునీకీకరణ..
షాద్నగర్ - గొల్లపల్లి ప్రాజెక్ట్లో అదనంగా లైన్ల నిర్వహణకు వీలుగా షాద్ నగర్ , గొల్లపల్లి , బాలానగర్ స్టేషన్ యార్డులను ఆధునీకీకరించారు. గాలి వెలుతురు ధారాళంగా ప్రసరించే నూతన స్టేషన్ భవనాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, ప్రణాళికాబద్ధమైన ఆవరణ , బుకింగ్ గదులు, సౌకర్యవంతమైన ప్లాట్ ఫారాలు , పాదచారుల వంతెనలు, తాగునీరు వంటి ప్రయాణికుల సౌకర్యాలు కల్పించారు.
అంతటి వేగాన్ని తట్టుకునేందుకు.
గంటకు 130 కి.మీ. వేగంతో వెళ్లే 25 టన్నుల యాక్సెల్ లోడ్లను తట్టుకోగలిగే విధంగా రైలు మార్గాన్ని రూపొందించారు. పీఎన్సీ గర్డర్లతో 3 పెద్ద వంతెనలు, ఆర్సీసీ బాక్స్తో 52 చిన్న వంతెనలు నిర్మించినట్లు అధికారులు పేర్కొన్నారు.