రాజకీయ పార్టీ పెట్టే విషయంలో వెనకబడిన కులాల సంఘాలతో విస్తృత స్థాయి సమావేశాలు జరిపి, త్వరలో నిర్ణయం తీసుకుంటామని... బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. బీసీల హక్కుల కోసం 45 ఏళ్లుగా మిలిటెంట్ తరహా ఉద్యమాలు చేశామని అన్నారు. వాటి ఫలితంగానే 2వేలకు పైగా జీవోలు, ఎన్నో సంక్షేమ హాస్టల్లు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు సాధించుకున్నట్లు పేర్కొన్నారు.
చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు...
చట్టసభల్లో బీసీ బిల్లు అనే అంశంపై హైదరాబాద్ లక్డీకపూల్లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యం అధ్యక్షతన నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుతం చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు సాధించుకునే డిమాండ్తో భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చెయ్యాల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టే విషయంలో అందరూ ఐక్యం కావాలని తెలిపారు.
బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ తేవాలి...
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటికరణ చేసే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిర్ణయం వల్ల అత్యధికంగా బీసీ ఉద్యోగులే నష్టపోతారని పేర్కొన్నారు. కేంద్రంలో ప్రత్యేకంగా బీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తరహాలోనే బీసీలకు కూడా ప్రొటెక్షన్ యాక్ట్ ఏర్పాటు చేయాలని తెలిపారు.
భారీ బహిరంగ సభ...
రాష్ట్ర ప్రభుత్వం బీసీ విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజు రీయంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఉన్నత చదువులకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల్లోని అన్ని కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి బడ్జెట్ కేటాయించాలన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో బీసీ అభ్యర్థికి సీటు కేటాయించాలని అధికార తెరాసను కోరారు. తమ డిమాండ్ల సాధనకు త్వరలో రాష్ట్ర రాజధానిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి... బీసీలను ఐక్యం చేస్తామన్నారు.
ఇదీ చదవండి: 'శివుడు పేద ప్రజల కష్టాలు తీర్చే భోళా శంకరుడు'