ఏపీలో వేసవిలో కృష్ణా డెల్టా తాగునీటి అవసరాలు తీర్చేందుకు వీలుగా పోలవరం వద్ద మరో ఎత్తిపోతల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పోలవరం జలాశయంలో నీళ్లు నిలబెట్టిన తర్వాత 32 మీటర్ల స్థాయి నుంచి నీటిని ఎత్తిపోసి.... కుడి కాలువ ద్వారా తాగునీటి అవసరాలు తీర్చేందుకు వీలుగా ఈ పథకం చేపట్టనున్నారు. సుమారు రూ.800 కోట్లతో ప్రాథమిక అంచనాలు సిద్ధం చేసి... ఏపీ జలవనరుల శాఖ ఉన్నతాధికారులకు పంపారు.
పోలవరం జలాశయంలో నీళ్లు నిలబెట్టక ముందే ఈ పంపుహౌస్ నిర్మాణం పూర్తికావాల్సి ఉన్నందున... ఇప్పుడే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఏపీ జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ఈ ప్రతిపాదనలను పరిశీలించి, సాధ్యాసాధ్యాలు మదింపు చేయనున్నారు. ఆ తర్వాత ఏపీ ఆర్థికశాఖకు పంపి అక్కడ ఆమోదం పొందిన అనంతరం పాలనామోదం ఇస్తూ నిర్ణయం తీసుకోనున్నారు. ఆ తర్వాత టెండర్లు పిలిచి పనులు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టు పనులు వచ్చే జులై లోపు పూర్తి కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: పెళ్లి వేడుకల్లో ఘర్షణ... యువకుడి హత్య