Republic day celebrations 2022 : రాష్ట్రవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ పార్టీ ఆఫీసులు, ప్రభుత్వ కార్యాలయాల్లో మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ భవన్లో గణతంత్ర వేడుకలు
Flag hoisting in TRS Bhavan : హైదరాబాద్ తెలంగాణ భవన్లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెరాస సెక్రటరీ జనరల్ కేశవరావు జాతీయ పతాకం ఆవిష్కరించారు. ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. లాకికత్వం, సమానత్వమే రాజ్యంగం ముఖ్య ఉద్దేశమని కేశవరావు వ్యాఖ్యానించారు.
![Republic day celebrations 2022 , flag hoisting in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14286891_flgg.png)
జెండా ఎగురవేసిన రేవంత్
REVANTH REDDY : గణతంత్ర వేడుకలు పురస్కరించుకొని గాంధీభవన్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. వేడుకల్లో కాంగ్రెస్ సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, గీతా రెడ్డి సహా పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో భారతదేశాన్ని ప్రపంచ దేశాలకు ధీటుగా నిలబెట్టాలని రేవంత్ రెడ్డి అన్నారు.
![Republic day celebrations 2022 , flag hoisting in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14286891_revanth.png)
'రాజ్యాంగం ప్రజలకు ఒక భరోసా'
Bandi Sanjay : దేశ ప్రజలకు భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో జాతీయ పతాకం ఆవిష్కరించారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ప్రజలకు ఒక భరోసా అని..... పాలకులకు మార్గనిర్దేశమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడితో పాటు భాజపా నేతలు ఇంద్రసేనారెడ్డి, పొంగులేటి సుధాకర్రెడ్డి, మాజీ మేయర్ కార్తీకరెడ్డి, భాజపా నేతలు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూం భవన్లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో చాడ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ బాధ్యతగల పౌరుడిగా మెలగాలని సూచించారు.
![Republic day celebrations 2022 , flag hoisting in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14286891_bandi.png)
శాసనసభ ఆవరణలో మువ్వన్నెల జెండా రెపరెపలు
రాష్ట్ర శాసనసభ, మండలి ఆవరణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలిలో ప్రొటెం ఛైర్మన్ అమినుల్ హసన్ జాఫ్రీలు జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ అనంతరం శాసనసభ ఆవరణలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏ అంశంలో అయినా కేంద్రానికి దిక్సూచిగా ఉందన్నారు. రాష్ట్రానికి కేంద్రం పెద్దన్నగా అండగా ఉండాలని విజ్ఞప్తిచేశారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని అన్నారు.
![Republic day celebrations 2022 , flag hoisting in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14286891_speaker.png)
జెండా ఆవిష్కరించిన మేయర్
Mayor Gadwal Vijayalakshmi : గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ లోకేష్ కుమార్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ వేడుకల్లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్, కమిషనర్లు పోలీస్ వందననాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు పౌసుమి బసు, శృతి ఓజా, సంతోష్, ఈవీడీఎం విశ్వజిత్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
![Republic day celebrations 2022 , flag hoisting in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14286891_ghmc.png)
జలమండలిలో గణతంత్ర వేడుకలు
హైదరాబాద్ జలమండలిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో జరిగిన వేడుకలకు జలమండలి ఎండీ దానకిశోర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో ఛైర్మన్ జనార్దన్... జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు.
కొవిడ్ నిబంధనల మధ్య జెండా ఆవిష్కరణ
కొవిడ్ నిబంధనల ప్రకారం 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఘనంగా జరిగాయి. హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో... ఛైర్మన్ జస్టిస్ చంద్రయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సభ్యులు ఆనందరావు, ఇర్ఫాన్, సిబ్బందితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఇదీ చదవండి: ప్రగతిభవన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్