కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తలపెట్టిన ర్యాలీకి అనుమతి ఇవ్వని పోలీసు శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను గాంధీభవన్ బయటకు రాకుండా తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నగరంలోని ప్రతి డివిజన్ నుంచి వంద నుంచి 150 మంది కార్యకర్తలు ర్యాలీలో పాల్గొనేందుకు రావాలని గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజనీకుమార్ పిలుపునివ్వడంతో పోలీసు శాఖ...మరింత అప్రమత్తమైంది. కాంగ్రెస్ నాయకులను ఈ రాత్రి గృహనిర్బంధం చేసే అవకాశం ఉంది. జిల్లాల నుంచి ఎవరైనా వచ్చేందుకు యత్నిస్తే మధ్యలోనే అడ్డుకోవాలని పోలీసులు యోచిస్తున్నారు.
గాంధీభవన్ రెండు ద్వారాల వద్ద భారీగా పోలీసులను మోహరింప చేయడంతోపాటు...రోడ్డుమీదకు వస్తే తక్షణమే అరెస్ట్ చేసి తరలించేందుకు అవసరమైన వాహనాలను కూడా సిద్ధంగా ఉంచుతారు. గాంధీ భవన్ నుంచి లోయర్ ట్యాంకుబండ్ అంబేడ్కర్ విగ్రహం వరకు దారి వెంబడి కూడా పోలీసు పికెట్లు ఏర్పాటు చేయనున్నారు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహించుకుంటామని ఇప్పటికే మూడు దఫాలు పోలీసులకు విజ్ఞప్తి చేసినా...అనుమతికి నిరాకరించడంతో...ఎట్టి పరిస్థితుల్లో ర్యాలీ చేసి తీరుతామని కొందరు కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: తెలంగాణలో "కల్వకుంట్ల పోలీసు సర్వీస్" నడుస్తోంది: కాంగ్రెస్