పరీక్షల ఫలితాలను తమ విద్యా వ్యాపారానికి వినియోగించుకుంటూ ప్రకటనలు ఇచ్చి ప్రచారం చేసుకుంటున్న ప్రైవేట్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ప్రభుత్వం ప్రకటించిన ఫలితాలను విద్యా సంస్థలు తమ స్వప్రయోజనానికి, ప్రచారాలకు వాడుకోవడం చట్ట విరుద్ధమని.. అలాంటి విద్యాసంస్థలకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. ఇంటర్మీడియట్ విద్యా కార్యదర్శి ఇచ్చిన సర్క్యూలర్తో ఫలితం లేదని అసోసియేషన్ అధ్యక్షుడు నాగటి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి పగడాల లక్ష్మయ్య ప్రశ్నించారు.
జీవో 29లోని 23 సంవత్సరాలనాటి 1997 యాక్టు నిబంధనలను చూపించి కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీలను కంట్రోల్ చేయాలనుకోవడం భ్రమ అని వారు అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు, చట్టాలు ఎన్ని ఉన్నా ప్రభుత్వ పెద్దల అండతో నడుస్తున్న కార్పొరేట్ కాలేజీలను విద్యాశాఖ అధికారులు ఏమీ చేయలేకపోతున్నారని ఆరోపించారు. జీవో 29లోని సెక్షన్ 14(6) ప్రకారం కాలేజీల అడ్మిషన్ ఫారాలు పరిశీలించి వెంటనే కాలేజీలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికైనా అక్రమ విద్యా వ్యాపారానికి పాల్పడుతున్న కార్పొరేట్ కాలేజీల భరతం పట్టాలని వారు కోరారు.