హైదరాబాద్ జీడిమెట్ల ఫాక్స్సాగర్ చెరువుకు వరద ఉద్ధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. చెరువు పూర్తిస్థాయి నీటి మట్టం 37 అడుగులు కాగా ప్రస్తుతం 33 అడుగులకు చేరుకుంది. మరో నాలుగు అడుగులు చేరితే చెరువు కట్టపై నుంచి నీరు ప్రవహించే ప్రమాదం ఉంది. దిగువన ఉన్న సుభాశ్నగర్, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, షాపూర్నగర్ ప్రాంతాల్లో నివసించే వారికి ప్రమాదం పొంచి ఉంది.
మత్యకారులు ఏర్పాటు చేసుకున్న గుడిసెలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. వారి సామగ్రి తడిసి ముద్దైంది. తాత్కాలికంగా వారు చెరువు కట్టపై గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారు. భారీ వర్షాలకు డ్రైనేజీ నీరు పొంగి ఎగువ నుంచి వచ్చిన నీరు... చెరువులో కలుస్తున్నాయి.
జీడిమెట్లలోని పరిశ్రమల రసాయనాలు ఇందులో కలుస్తున్నాయి. వీటి వల్ల చెరువులోని చేపలు మృత్యువాత పడుతున్నాయి. చెరువు నిండడం వల్ల స్థానిక ఎమ్మెల్యే వివేకానంద పరిశీలించి అధికారులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
- ఇదీ చదవండి : టోలీచౌకి నదీమ్ కాలనీలో మంత్రి కేటీఆర్ పర్యటన