NTR image on hundred rupee silver coin: నందమూరి తారక రామారావు తెలుగు ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఆయన రూపం సమ్మోహనం, సుమనోహరం, అభినయ వేదం, తన నటనకు విశ్వవిద్యాలయం తెలుగువారి ఖ్యాతిని విశ్వమంతా ఎలుగెత్తి చాటిన జాతిరత్నం. తెలుగుజాతికి ఐక్యతా చిహ్నం.. వెండితెర వేల్పు, మేలుకొలుపు, ప్రేక్షకుల ప్రపంచానికి తారక రామారావు ఓ ఆరాధ్య దైవం, తెలుగు సినీ వజ్రోత్సవ చరిత్రలో ఆయనో సువర్ణాధ్యాయం, సాంఘికం, పౌరాణికం, చారిత్రకం, జానపదం ఏదైనా తనకు నటనే ప్రాణప్రదం.
ఆకర్షించే ఆహార్యం, ఆకట్టుకునే అభినయం, అలరించే గళం.. వెరసి తెలుగు సినిమాకు రామారావు ఓ వరం. నటనతో పాటు రాజకీయల్లోనూ కొత్త చరిత్ర సృష్టించిన వ్యక్తి నందమూరి తారక రామారావు. ఈలాంటి వ్యక్తి పేరిట నాణెం ముద్రణ చేయడం తెలుగు ఖ్యాతిని మరింత పెంచడమే అవుతుంది. ఆయన ఎంతో మందికి ఆదర్శవంతుడై ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారు.
ఈ నేపథ్యంలో టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల వేళ తెలుగు ప్రజలకు కేెంద్రం తీపి కబురు చెప్పింది. ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 వెండి నాణెం ముద్రణకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ కూతురు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరిని మింట్ అధికారులు కలిసి ఆమె నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు.
నాన్న ఆశీర్వాదం వల్లే ఇది సాధ్యమైంది: అనంతరం ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఐదారు మాసాల కిందట ఎన్టీఆర్ పేరిట నాణెం తీసుకురావాలని కోరుతూ కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ దృష్టికి తీసుకెళ్లానని పురందేశ్వరి అన్నారు. నాణెం ముద్రణ కోసం ఎన్టీఆర్ నేపథ్యం స్వీకరించిన మింట్ అధికారులు 3 ఫోటోలు పరిశీలించారని తెలిపారు.
ప్రొసీజర్ అంతా నెల రోజులు పడుతుందని, ఆ తరువాత మరో నెల రోజుల్లో ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 వెండి నాణెం విడుదలవుతుందని తెలిపారు. నాన్న ఆశీర్వాదం వల్లే ఇది సాధ్యమైందని, ఇదొక అదృష్టంగా భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. తెలుగుజాతి రత్నంగా కోట్లాది మంది గుండెల్లో దేవుడుగా పూజింపబడుతున్న ఎన్టీఆర్ గొప్పతనం, సమున్నత సేవలు దృష్ట్యా భవిష్యత్తులో భారతరత్న కూడా లభించవచ్చని పురందేశ్వరి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి :