రైతులు తీసుకున్న పంటరుణాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వడ్డీ రాయితీ బకాయిలు విడుదల కాకపోవడంవల్ల 'జిల్లా కేంద్ర సహకార బ్యాంకు'(డీసీసీబీ)లకు ముప్పు ఏర్పడింది. ఉమ్మడి రాష్ట్రమున్నప్పటి నుంచే ఈ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయనందున అవి కాస్తా పెరిగి రూ.600 కోట్లు దాటిపోయాయి. వీటిని ఏళ్ల తరబడి ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలంటూ చూపడం తగదని, బ్యాంకు ఖర్చుల్లో రాయాలని రిజర్వు బ్యాంకు తాజాగా నోటీసులిచ్చింది. గత ఆర్థిక సంవత్సరం(2019-20) లావాదేవీలపై అన్ని డీసీసీబీలు సెప్టెంబరులోగా ఆడిట్ నివేదికలను రిజర్వుబ్యాంకు, నాబార్డులకు పంపాలి.
ఈ ఆడిట్లో ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను 2019-20లో ఖర్చు కింద చూపాలని రిజర్వు బ్యాంకు స్పష్టం చేసింది. ఇలా చేస్తే బ్యాంకులన్నీ నష్టాల్లోకి వెళ్తాయని, ‘నిరర్థక ఆస్తుల ఖాతా’(ఎన్పీఏ)లోకి చేరతాయని ‘తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు’(టీఎస్ క్యాబ్) తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. వాస్తవానికి మొత్తం రూ.600 కోట్లు డీసీసీబీల పేరున కాకుండా, ఇందులో రూ.300 కోట్లకు పైగా ‘ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల’(ప్యాక్స్)కు ప్రభుత్వం ఇవ్వాలని రికార్డులో రాశారు. ఈ సొమ్ము రాకపోతే ఈ సంఘాలూ ఎన్పీఏలోకి చేరి బయట అప్పులు పుట్టవు.
ఏమిటీ బకాయిలు?
ఏటా స్వల్ప, దీర్ఘకాలిక రుణాలను రైతులకు డీసీసీబీలిస్తాయి. స్వల్పకాలిక పంటరుణం రూ.లక్షలోపు తీసుకున్న రైతు ఏడాదిలోగా తిరిగి చెల్లిస్తే దానిపై వడ్డీని ‘వడ్డీ లేని రుణాలు’(వీఎల్ఆర్) పథకం కింద పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ పథకం కింద 2016 నుంచి నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకూ రైతు తీసుకుంటే దానిపై 2 శాతం వడ్డీని ప్రభుత్వం భరించి ఆ నిధులు బ్యాంకులకు ఇవ్వాలి. ఇక దీర్ఘకాలిక రుణం కింద రైతులు తీసుకునే వ్యవసాయ మార్టిగేజ్ రుణాలపై 6 శాతం వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం సహకార బ్యాంకులకు ఇచ్చే పథకాన్ని 2017 దాకా అమలుచేశారు. ఈ బకాయిలు 2006 నుంచి 2017 దాకా రాష్ట్ర ప్రభుత్వం సహకార బ్యాంకులకు విడుదలచేయలేదు. ఈ బకాయిలన్నీ రూ.600 కోట్లపైగా ఉన్నట్లు టీఎస్ క్యాబ్ ప్రభుత్వానికి తెలిపింది.
ఈ బకాయిలు ప్రభుత్వం నుంచి తీసుకోవడానికి ఈ ఏడాది(2020-21)లో ప్రయత్నిస్తామని, ఒకవేళ అక్కడి నుంచి రాకపోతే 2021-24 మధ్య వరసగా మూడేళ్ల పాటు బ్యాంకు ఖర్చులో వీటిని చూపడానికి అవకాశమివ్వాలని రిజర్వుబ్యాంకుకు లేఖ రాయాలని టీఎస్ క్యాబ్ యోచిస్తోంది. ఒకే ఏడాది(2019-20) ఖర్చులో మొత్తంచూపితే నష్టాలతో బ్యాంకులకు ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పనుంది. మరోపక్క ప్రభుత్వం నుంచి బకాయిలు ఇప్పించాలని సహకారశాఖ మంత్రికి కూడా డీసీసీబీలు తాజాగా విన్నవించాయి.
ఒక్క ఖమ్మం డీసీసీబీకే రూ.55 కోట్లు, నల్గొండ డీసీసీబీకి రూ.37 కోట్ల వరకూ రావాలి. ఇవి తిరిగిరాని అప్పుల కింద ఖర్చుల్లో రాస్తే బ్యాంకులకు నష్టాలు పెరుగుతాయి. ఎన్పీఏల శాతం అధికంగా ఉంటే నాబార్డు నుంచి వచ్చే నిధులూ తగ్గిపోతాయి. అప్పుడు రైతులకు రుణాలివ్వడం కష్టమవుతుంది.