తెలంగాణలోని ప్రతీ జిల్లాలో నవోదయ పాఠశాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్ పల్లి వినోద్ కుమార్ కోరారు. ఈ మేరకు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్కు లేఖ రాశారు. నవోదయ పాఠశాలల ఏర్పాటులో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. సుమారు నాలుగు కోట్ల జనాభాకు తొమ్మిది నవోదయ పాఠశాలలే ఉన్నాయని వినోద్ కుమార్ లేఖలో పేర్కొన్నారు.
తెలంగాణ పట్ల 'కేంద్ర' వివక్ష...
33 జిల్లాలకు ఒకటి చొప్పున కొత్తగా నవోదయ పాఠశాలలు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ గతంలో ప్రధానిని కోరారని గుర్తు చేశారు. ఈ మేరకు కేంద్రానికి సిఫార్స్ చేయాలని కోరారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంటులోనూ ప్రస్తావించినట్లు రాజీవ్ కుమార్ దృష్టికి తెచ్చారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తోందని వినోద్ కుమార్ ఆరోపించారు. అన్ని రంగాల్లో పురోగమిస్తున్న తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపడం సరికాదన్నారు.
మా కంటే తక్కువ జనాభా వాళ్లకే అన్నీ...
తెలంగాణ కన్నా తక్కువ జనాభా ఉన్న ఉత్తర, మధ్య రాష్ట్రాలకు పెద్ద ఎత్తున నవోదయ పాఠశాలలు కేటాయించారన్నారు. చత్తీస్ ఘడ్, జార్ఖండ్, అసోం, హర్యానా వంటి రాష్ట్రాల కన్నా తెలంగాణలో జనాభా ఎక్కువని ఉదాహరించారు. రాష్ట్రంలో అక్షరాస్యతను పెంచేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని...అందుకే ఈచ్ వన్ - టీచ్ వన్ అక్షర ఉద్యమాన్ని చేపట్టారని అన్నారు.