కొవిడ్ నియంత్రణలో భాగం సూపర్ స్ప్రెడర్లకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ ప్రక్రియ విజయవంతం అయిందని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి తెలిపారు. జిల్లాలోని జర్నలిస్టులు, ఫొటో గ్రాఫర్లు, రేషన్ డీలర్లు, పెట్రోల్ బంక్, గ్యాస్ డెలివరీ సిబ్బందికి రెండు రోజుల పాటు కరోనా వ్యాక్సినేషన్ వేసినట్లు చెప్పారు. ఉప్పల్లోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. సూపర్ స్ప్రెడర్లకు టీకాలు అందచేస్తున్న తీరును అడిగి తెలుసుకొన్నారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాలకు కేటాయించిన సిబ్బంది విధులకు హాజరయ్యారా లేదా అనే విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. టీకా కోసం నమోదు చేసుకున్న వారి వివరాలను కలెక్టర్ శ్వేతా మహంతి పరిశీలించారు. టీకాలు వేసుకున్న వారు వైద్యుల సూచనలు తప్పకుండా పాటించాలని.. ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదని కోరారు. జిల్లాలోని ఉప్పల్, కూషాయిగూడ, కూకట్పల్లి, మియాపూర్, మేడ్చల్ ఆర్టీసీ డిపోల్లో కార్మికులకు, మేనేజర్లు, కంట్రోలర్లు, డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజిలో పని చేసే వారికి వ్యాక్సిన్ వేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ శ్యాంసన్, డీఎంహెచ్వో డాక్టర్ మల్లికార్జున్రావు, మండల ప్రత్యేకాధికారి, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.
ఇదీ చదవండి : Lockdown Effect: ఆర్థిక సుడిగుండంలో కూరగాయల రైతు