Mallu Swarajyam is no more: రైతాంగ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలియజేశారు. సాయుధ పోరాటానికి తుంగతుర్తి గడ్డ అందించిన గొప్ప బిడ్డ స్వరాజ్యమని సీఎం అన్నారు. మల్లు స్వరాజ్యం గమనం, గమ్యం రేపటి తరాలకు స్ఫూర్తి ఇచ్చిందని కొనియాడారు. గొప్ప మహిళా నేతను కోల్పోవడం తెలంగాణకు తీరని లోటు అని సంతాపం వ్యక్తం చేశారు. మల్లు స్వరాజ్యం కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
సురవరం సంతాపం
మల్లు స్వరాజ్యం మృతిపట్ల సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి సంతాపం తెలియజేశారు. ప్రముఖ మహిళా నాయకురాలు మల్లు స్వరాజ్యం మృతి తీవ్రమైన బాధను కలిగించిందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె చాలా ముఖ్యమైన పాత్ర నిర్వహించారని తెలిపారు. శాసనసభ్యురాలిగా రైతులు, శ్రామికులు, పేద ప్రజల తరఫున వారి వాణి వినిపించారన్నారు. వేలాది మంది మహిళలకు కమ్యూనిస్టు కార్యకర్తలకు ఆమె స్ఫూర్తిని కలిగించారని గుర్తుచేశారు. చివరిదాకా రాజకీయ పోరాటం చేస్తూనే ఉన్నారన్న ఆయన.. ఆమె ఒక అరుదైన పోరాట యోధురాలని కీర్తించారు. సీపీఐ జాతీయ సమితి తరఫున వారికి ఆయన శ్రద్ధాంజలి ఘటించారు.
సభాపతి పోచారం సంతాపం
మల్లు స్వరాజ్యం మృతి పట్ల సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సంతాపం తెలియజేశారు. స్వరాజ్యం భూస్వామ్య కుటుంబంలో పుట్టి, పేదల పక్షాన పోరాడారని ఆయన పేర్కొన్నారు. రజాకార్లను ఎదురించి పోరాడిన యోధురాలని కీర్తించారు. మల్లు స్వరాజ్యం ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ప్రార్థించారు. స్వరాజ్యం కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
స్వరాజ్యం పేరు ఉంటే పోరాటం గుర్తుకు వస్తుంది..
మల్లు స్వరాజ్యం మృతి పట్ల తమ్మినేని వీరభద్రం సంతాపం తెలియజేశారు. మల్లు స్వరాజ్యం పేరువింటే సాయుధ పోరాటం గుర్తుకు వస్తుందన్నారు. సాయుధ పోరాటంలో పాల్గొన్న వీరవనిత మల్లు స్వరాజ్యం అని చెప్పారు. స్వరాజ్యం మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి, సీపీఎంకు తీరని లోటన్నారు.
పీసీసీ చీఫ్ రేవంత్ సంతాపం
మల్లు స్వరాజ్యం సాయుధ పోరాటంలో ముందుండి పోరాట పటిమ ప్రదర్శించారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆమె మృతిపట్ల ఆయన సంతాపం తెలిపారు. రజాకార్లకు, నవాబులకు వ్యతిరేకంగా ఆమె పోరాడారన్నారు. 92 ఏళ్ల పాటు దళితులు, గిరిజనుల, బహుజనుల కోసం కృషిచేశారని కొనియాడారు. తెలంగాణకు మహోన్నత స్ఫూర్తిగా, ఉద్యమ స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. గొప్ప నాయకురాలిని తెలంగాణ సమాజం కోల్పోయిందని రేవంత్ వెల్లడించారు.
ఆమె మరణ బాధాకరం: బండి సంజయ్
మల్లు స్వరాజ్యం మరణం బాధాకరమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మల్లు స్వరాజ్యం కుటుంబ సభ్యులకు భాజపా తెలంగాణ శాఖ పక్షాన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో మల్లు స్వరాజ్యం పాత్ర మరువలేనిదని చెప్పారు. తుపాకీ పట్టుకుని ప్రత్యక్షంగా యుద్ద రంగంలో దిగి నాటి నిజాం ప్రభుత్వానికి, రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడిన వీర వనిత మల్లు స్వరాజ్యం అంటూ ఆయన కీర్తించారు. సిద్ధాంతాలు వేరైనా ప్రజా సమస్యలపైనా ముఖ్యంగా పేదల పక్షాన మల్లు స్వరాజ్యం చేసిన పోరాటాలు చిరస్మరణీయమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మద్యపాన నిషేధ ఉద్యమంలో మల్లు స్వరాజ్యం పాత్ర మరువలేనిదని గుర్తు చేసుకున్నారు.
ఇదీ చదవండి: