హైదరాబాద్ పరిధి జూబ్లీహిల్స్ హుడా ఎన్క్లైవ్ కాలనీలో 3 ఎకరాల పార్కును జీహెఎంసీ కబ్జా చేసి వాల్టా చట్టానికి వ్యతిరేకంగా 100 చెట్లను నరికేసిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. చట్టాలను అమలు చేయాల్సిన ప్రభుత్వాలే నిబంధనలు ఉల్లంఘించడం సరికాదన్నారు. గత రెండు వారాల నుంచి అర్ధరాత్రి ఈ పనులు చేస్తున్నారని అన్నారు.
పక్కనే ప్రైవేట్ ఆస్తులు ఉన్నా పార్కులు ఎందుకు కబ్జా చేస్తున్నారో అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వచ్చి అక్కడ రాళ్లను పగల గొట్టడం వల్ల పక్కనున్న ఇళ్ల గోడలు పగులుతున్నాయన్నారు. ఇళ్లల్లో కూడా భయాందోళనకు గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులకు, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లినా పట్టించుకోవట్లేదని వాపోయారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ స్పందించి పార్కును యథాతథంగా ఉంచాలిన కోరారు. పక్కనే ఉన్న ప్రైవేట్ ఆస్తులు సేకరించి రోడ్డు నిర్మించాలని కాలనీ వాసులు విజ్ఞప్తి చేశారు.