అపెక్స్కౌన్సిల్ భేటీలో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అపెక్స్ కౌన్సిల్ భేటీకి సంసిద్ధత తెలుపుతూ కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించారు. అజెండాలో చేర్చాల్సిన అంశాలను లేఖలో పేర్కొంటామని వెల్లడించారు. ఈ నెల 25న అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహణకు కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించిన సీఎం... కేంద్రం, ఏపీ ప్రభుత్వాల సందేహాలన్నింటిని నివృత్తి చేస్తామని తెలిపారు. నదీ జలాల వినియోగంలో తెలంగాణ అభ్యంతరాలను సమావేశంలో వెల్లడిస్తామన్నారు. సంబంధిత సమగ్ర సమాచారం అధికారులు సిద్ధం చేయాలని ఆదేశించారు. వాస్తవానికి తెలంగాణలో కొత్త ప్రాజెక్టులేవీ చేపట్టలేదని... ఉమ్మడి ఆంధ్రాలో ప్రాజెక్టులనే తెలంగాణ అవసరాలు తీర్చేలా రీడిజైన్ చేశామని తెలిపారు. ఆధారాలతో సహా కౌన్సిల్ సమావేశంలో ఈ విషయం చెప్పాలని సూచించారు.
ప్రాజెక్టుల మంజూరు, నిధుల కేటాయింపు, టీఎంసీల కేటాయింపు వివరాలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. తెలంగాణ వచ్చే నాటికే చేసిన ఖర్చు, సేకరించిన భూమి వివరాలు సిద్ధం చేయాలన్నారు. బచావత్ ట్రైబ్యునల్ అవార్డుకు అనుగుణంగానే తెలంగాణ వ్యవహరిస్తుందన్న ముఖ్యమంత్రి పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు, రాయలసీమ ఎత్తిపోతలపై అభ్యంతరం చెప్పాలన్నారు. గోదావరి, కృష్ణా నదుల్లో ఏపీ అక్రమంగా వాడుకుంటున్న నీటి విషయంపై నిలదీయాలని తెలిపారు. సమగ్ర సమాచారం, అవసరమైన దస్త్రాలను అధికారులు సిద్ధం చేయాలన్నారు. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కేంద్రం, ఏపీల అభ్యంతరాలు అర్థం లేనివని విమర్శించారు. నదీ జలాల వినియోగంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై అనేక సార్లు ఫిర్యాదు చేశామన్న ముఖ్యమంత్రి కేసీఆర్... అపెక్స్ కౌన్సిల్ అన్ని అంశాలను చేర్చి న్యాయం చేయాల్సిందిగా కోరతామని తెలిపారు.