పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో అభ్యర్థులు రికార్డు స్థాయిలో నిలిచారు. రెండు నియోజకవర్గాల్లోనూ భారీ సంఖ్యలో పోటీలో ఉన్నారు. హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్నగర్ నియోజకవర్గం నుంచి ఏకంగా 93 మంది పోటీలో ఉండగా... నల్గొండ - వరంగల్ - ఖమ్మం బరిలో 71 మంది ఉన్నారు. మండలి ఎన్నికల్లో ఈ స్థాయిలో అభ్యర్థులు పోటీలో నిలవడం ఇదే ప్రథమం.
ఈసారి అలా కాదు..
గతంలో ఉమ్మడి రాష్ట్రంలో శాసనమండలి పునరుద్ధరణ సమయంలో 2007 ఎన్నికల్లో హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 57 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అప్పుడు పెద్ద బ్యాలెట్నే వాడాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య కేవలం 2 లక్షల 20 వేలు మాత్రమే. అందులో సగం మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపునకు రెండున్నర రోజుల సమయం పట్టింది. ప్రస్తుతం హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్నగర్ నియోజకవర్గంలో 5 లక్షల 31 వేల మంది... నల్గొండ - వరంగల్ - ఖమ్మం నియోజకవర్గంలో 5 లక్షల 5 వేల మంది ఓటర్లున్నారు. కనీసం 50 శాతం పోలింగ్ నమోదైనా... రెండున్నర లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. అభ్యర్థుల సంఖ్య భారీగా ఉండడం అధికారులకు సవాల్గా మారింది.
జంబో సైజులో...
బ్యాలెట్ పత్రంలో ఒక నియోజకవర్గంలో 93.. మరో నియోజకవర్గంలో 71 పేర్లు ముద్రించాల్సి ఉంటుంది. బ్యాలెట్లో నాలుగు కాలమ్స్ ఉంటాయి. క్రమ సంఖ్య, అభ్యర్థి పేరు, ఫోటో ఉంటాయి. వాటికి ఎదురుగా ఓటర్లు ప్రాధాన్య సంఖ్య వేసేందుకు వీలుగా మరో కాలమ్ ఉంటుంది. ఏకంగా 93 మంది అభ్యర్థులకు బ్యాలెట్ అంటే.. అది జంబో సైజులో ఉంటుంది. ఎన్నికల సంఘం నిర్దేశిత ప్రమాణాల ప్రకారం.. బ్యాలెట్ ముద్రించాల్సి ఉంటుంది. దినపత్రిక పరిమాణంలో బ్యాలెట్ పత్రం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సీఎస్సీకి నివేదించిన రాష్ట్ర ఎన్నికల సంఘం
భారీ సంఖ్యలో అభ్యర్థులున్న విషయాన్ని.. కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం నివేదించింది. బ్యాలెట్ పత్రం పరిమాణం, సంబంధిత అంశాలను అందులో పేర్కొన్నారు. బ్యాలెట్ పత్రం పరిమాణానికి అనుగుణంగానే.. బ్యాలెట్ బాక్సులను కూడా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. సాధారణ బ్యాలెట్ బాక్సులు ఉపయోగపడతాయా లేదా అన్నది... చూడాల్సి ఉంటుంది. బ్యాలెట్ బాక్సుల సన్నద్ధతపై సంబంధిత జిల్లాల కలెక్టర్లతో... నేడు సమావేశం కానున్నారు. ఈసీ నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా.. ఎమ్మెల్సీ ఎన్నిక కోసం బ్యాలెట్ పత్రం, బాక్సుల విషయమై తదుపరి ముందుకెళ్తామని అధికారులు చెప్తున్నారు.
ఇదీ చూడండి: మంత్రులకు ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్